- మున్సిపల్ ఎన్నికల్లో ఈ లెక్కే ఫైనల్
- కలెక్టర్లు, సీపీలు,ఎస్పీలతో కాన్ఫరెన్స్లో ఈసీ నాగిరెడ్డి
- సెక్యూరిటీ, ఎన్నికల సిబ్బందిపై దృష్టి పెట్టాలని సూచన
- ఓటర్ల సంఖ్యకు అదనంగా 10 శాతం బ్యాలెట్పేపర్లు
- నామినేషన్ల ఉపసంహరణ తర్వాతే ప్రింటింగ్
హైదరాబాద్, వెలుగు:
వచ్చేనెల 22న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా కలెక్టర్లు, పోలీస్కమిషనర్లు, ఎస్పీలు సెక్యూరిటీతో పాటు ఎన్నికల సిబ్బందిపై దృష్టి పెట్టాలని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డి ఆదేశించారు. శుక్రవారం డీజీపీ మహేందర్రెడ్డి, సీడీఎంఏ శ్రీదేవితో కలిసి ఆయన కలెక్టర్లు, పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని 10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో సుమారు 53 లక్షల మంది వరకు ఓటర్లున్నట్టుగా అంచనా వేశామని, 30న ప్రకటించే డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు. ఓటర్లు పెరిగిన నేపథ్యంలో ప్రతి 800 మందికి ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ల గుర్తింపుకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చామని, దీన్ని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలన్నారు.
ఆఫీసర్లు, సిబ్బందికి మరోసారి ట్రైనింగ్
ఎన్నికల డ్యూటీలో పాల్గొనే రిటర్నింగ్ ఆఫీసర్లు, ఇతర స్టాఫ్కు త్వరలోనే మరోసారి ట్రైనింగ్ఇస్తామన్నారు. పోలింగ్స్టేషన్ల సంఖ్య తేలిన తర్వాత కావాల్సిన సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసుకోవాలన్నారు. రూట్ ఆఫీసర్లు, మైక్రో అబ్జర్వర్లు, ఇతర ఎన్నికల పర్యవేక్షణ సిబ్బందికి జ్యుడీషియరీ అధికారాలు కల్పించాలన్నారు.
ఉపసంహరణ తర్వాతే ‘బ్యాలెట్’ ప్రింటింగ్
డివిజన్లు, వార్డుల వారీగా పోటీ చేసే క్యాండిడేట్లు ఎవరో తేలిన తర్వాతే బ్యాలెట్ పేపర్లు ముద్రించాలని సూచించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసే 14వ తేదీ తర్వాతే బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్కు ఆర్డర్ ఇవ్వాలన్నారు. వాటిపై క్యాండిడేట్ పేరు, పార్టీ, సింబల్ప్రింట్ చేయాలన్నారు. ఓటర్ల సంఖ్యకు అదనంగా కనీసం 10 శాతం బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేసుకోవాలన్నారు.
విభజించాల్సిన ఓటర్లు 10 లక్షలే..
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డులు, డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాలు కొలిక్కి వస్తున్నాయని కలెక్టర్లు..ఈసీకి తెలిపారు. మొత్తం 53 లక్షల మంది ఓటర్లలో 43 లక్షల మందిని వార్డుల వారీగా విభజించామని, మిగతా వారు ఏయే వార్డుల్లోకి వస్తారో త్వరలోనే తేల్చి ఎలక్టోరల్ రోల్స్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.
నేడు పార్టీలతో సమావేశం
గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఉదయం11.30 గంటలకు సమావేశం కాబోతోంది. ఎన్నికలకు షెడ్యూల్, ఓటరు జాబితా ప్రకటన, వార్డుల డీలిమిటేషన్, పోలింగ్ స్టేషన్ల గుర్తింపుకు సంబంధించిన వివిధ అంశాలపై ఆయా పార్టీలతో ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, ఇతర అధికారులు చర్చించనున్నారు. ఆయా పార్టీలకు ఏవైనా అభ్యంతరాలుంటే అధికారులు సమాధానాలిస్తారు. నేషనల్ పార్టీలతో పాటు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలను ఈ మీటింగ్కు ఆహ్వానించినట్టుగా ఎస్ఈసీ అధికారులు తెలిపారు.
పోలింగ్ స్టేషన్ల గుర్తింపునకు సర్క్యులర్
10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో పోలింగ్ స్టేషన్ల గుర్తింపునకు ఎస్ఈసీ శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. 2019 జనవరి1నాటి ఓటరు జాబితా ఆధారంగా జనవరి 4న వార్డుల వారీగా ఫైనల్ ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అదే రోజున పోలింగ్స్టేషన్ల గుర్తింపునకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సిద్ధం చేస్తారు. దీనిని సంబంధిత కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో జనవరి 5న ప్రచురిస్తారు. 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దానిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. జనవరి 7వ తేదీ ఉదయం11 గంటలకు స్థానిక రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. 9న కలెక్టర్లకు పోలింగ్ స్టేషన్ల జాబితా సమర్పిస్తారు. 10వ తేదీన కలెక్టర్లు జాబితాకు ఆమోదముద్ర వేస్తారు. 13న మున్సిపల్ కమిషనర్లు వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ఫైనల్ జాబితాను పబ్లిష్ చేస్తారు.