
- ఈ విషయం ఐజీ చెప్పారు: బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
- ఎప్పుడు పిలిచినా వెళ్లి స్టేట్మెంట్ ఇస్త
- కేసును సీబీఐకి అప్పగించాలి
- బనకచర్లపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్
నిజామాబాద్, వెలుగు: తాను కూడా ఫోన్ ట్యాపింగ్బాధితుడినని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. స్వయంగా ఐజీ తనకు ఈ విషయం చెప్పారని, సిట్ విచారణ నోటీసు కోసం ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. నోటిసు వస్తే వెళ్లి స్టేట్మెంట్ ఇస్తానన్నారు. శుక్రవారం నిజామాబాద్లోని బీజేపీ జిల్లా ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని రీతిలో నీచమైన ఫోన్ ట్యాపింగ్ స్కామ్కు పాల్పడింది. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న విచారణపై మాకు నమ్మకంలేదు. కేసును సీబీఐకి అప్పగించడమే మంచిది. అట్లయితేనే అన్ని విషయాలు తేలతెల్లమవుతాయి” అని పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి
లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఈ రిజర్వేషన్ల తీర్మానాన్ని పార్టీ పరంగా తాము బలపర్చామని చెప్పారు. ఈ అంశంపై బట్టకాల్చి తమ మీద పడేసినట్లు చేస్తే ఊరుకోబోమన్నారు. బనకచర్ల ఇష్యూను అసెంబ్లీలో చర్చకు పెడితే తమ పార్టీ స్టాండ్ ఏమిటో స్పష్టం చేస్తామని పేర్కొన్నారు. బనకచర్లకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖ రాయాలని తాము ఇప్పటికే రాష్ట్ర సర్కార్కు సూచించామన్నారు.
‘‘మొన్నటి దాకా రాష్ట్రంలో కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన రాష్ట్రంలో ఉండగా ఇప్పుడు కాంగ్రెస్ ఢిల్లీ పాలన నడుస్తున్నది. ఇచ్చిన హామీలు ఎలా ఎగ్గొట్టాలో చర్చించడానికే గంటలకొద్దీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు” అని మహేశ్వర్రెడ్డి దుయ్యబట్టారు. హామీలు అమలు చేసేదాకా తాము వదలబోమని, జైలుకు వెళ్లడానికి కూడా భయపడబోమని చెప్పారు. పసుపు బోర్డ్ ఆఫీస్ ప్రారంభించడానికి ఈ నెల 29న కేంద్ర హోంమంత్రి అమిత్షా వస్తున్నారని, సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. మీడియా సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యానారాయణ, నేతలు న్యాలం రాజు, స్రవంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.