ఎల్లారెడ్డి పై నో క్లారిటీ!.. స్క్రీనింగ్​ కమిటీ మీటింగ్​లో చర్చోపచర్చలు

ఎల్లారెడ్డి పై నో క్లారిటీ!.. స్క్రీనింగ్​ కమిటీ మీటింగ్​లో చర్చోపచర్చలు
  • టికెట్​పై పట్టువీడని మదన్​మోహన్, సుభాష్​రెడ్డి
  • ఇద్దరిలో ఒకరిని పక్క నియోజకవర్గానికి వెళ్లాలని సూచిస్తున్న పార్టీ పెద్దలు​
  • నేడు వెలువడే కాంగ్రెస్​మొదటి లిస్ట్​లో పేరుండడం అనుమానమే?

కామారెడ్డి, వెలుగు : కాంగ్రెస్​పార్టీలో ఎల్లారెడ్డి నియోజకవర్గ టికెట్​వ్యవహారం హాట్ టాపిక్​గా మారింది. టికెట్​ఆశిస్తున్న ఆ పార్టీ నేతలు కె.మదన్​మోహన్​రావు, వడ్డేపల్లి సుభాష్​రెడ్డి పట్టు వీడడం లేదు. టికెట్​తమకే  కేటాయించాలంటూ తమ గాడ్​ ఫాదర్ల  ద్వారా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి కోసం ముఖ్య నేతలు స్ర్కీనింగ్​ కమిటీలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్​ రాష్ట్ర పెద్దలు ఢిల్లీ అధిష్టానానికి ఈ ఇద్దరి నేతల పేర్లు సిఫార్సు చేశారు. ఇక్కడ పలు దఫాలుగా నిర్వహించిన సమావేశాల్లోనూ ఎల్లారెడ్డిపై చాలా సేపు చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇరువురు నేతలు తమ బలాబలాలు, విజయావకాశాలను వివరిస్తూ టికెట్​తమకే కేటాయించాలంటూ పట్టుబట్టారు. వీరిద్దరిలో ఎల్లారెడ్డి టికెట్ ఎవరికి దక్కనుందనే దానిపై నియోజకవర్గంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. టికెట్​పై ఎవరికి వారు గట్టి ధీమాతో ఉన్నారు. మరో వైపు తమ నేతకే టికెట్​వస్తుందంటే తమ నేతకే అంటూ సోషల్​మీడియా వేదికగా వారి అనుచరులు పోస్టులు పెడుతున్నారు. 

ఒకరు పక్క నియోజకవర్గం వెళ్లండి..

టికెట్​ కోసం పోటీ పడుతున్న ఇరువురిని పార్టీ ముఖ్యనేతలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. స్థానిక పరిస్థితులు, సర్వే రిపోర్టులు, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకొని టికెట్ ​కేటాయిస్తామంటూ పార్టీ వర్గాలు తెలిపాయి. ఓ నేతను పక్క నియోజకవర్గానికి వెళ్లాలని సూచించినట్లు సమాచారం. అయితే నియోజకవర్గంలో క్యాడర్​ను  డెవలప్​ చేసుకొని, ఇప్పుడు పక్క నియోజకవర్గానికి వెళ్లి పోటీ చేయమంటే ఎలా అని అందుకు సదరు నేత నో చెప్పినట్లు తెలుస్తోంది. 

జుక్కల్, బాన్సువాడలో.. 

జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల సెలక్షన్​పై ఇంకా క్లారిటీ కాలేదు. జుక్కల్​లో మాజీ ఎమ్మెల్యే ఎస్.గంగారాం, ఎన్ఆర్ఐ లక్ష్మీకాంతరావు, డీసీసీ మాజీ ప్రెసిడెంట్​ గడుగు గంగాధర్ ​టికెట్​ఆశిస్తున్నారు. బాన్సువాడ టికెట్ ​కోసం కూడా చాలా మంది అధిష్టానానికి అర్జీలు పెట్టుకున్నారు. రెండు చోట్ల కూడా బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని అధిష్టానం భావిస్తోంది. బాన్సువాడలో కుల సమీకరణను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశముందని పార్టీలో చర్చ జరుగుతోంది.

మొదటి లిస్ట్​లో నో క్లారిటీ!

నేడు కాంగ్రెస్​ మొదటి లిస్ట్​లో విడుదల కానుంది. పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు కానున్నారు. మొదటి లిస్ట్​లో కామారెడ్డి నుంచి షబ్బీర్​ అలీ పేరు వచ్చే ఛాన్స్​ఉంది. టికెట్​ కోసం టఫ్ ​ఫైట్ ఉన్న నియోజకవర్గాలను నెక్ట్స్​లిస్ట్ లో ప్రకటించాలని అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఎల్లారెడ్డిపై క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.