భారీగా సెవరెన్స్ ప్యాకేజి అఫీషియల్గా ట్విటర్
బిజినెస్ డెస్క్, వెలుగు: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్ అధికారికంగా ట్విటర్ డీల్ను పూర్తి చేశారు. ట్విటర్ను టేకోవర్ చేయగానే మొదట కంపెనీ సీఈఓ పరాగ్ అగర్వాల్ను, మరో ముగ్గురు టాప్ ఉద్యోగులను తీసేశారు. కొత్త సీఈఓను నియమించేంత వరకు మస్కే ట్విటర్కు తాత్కాలిక సీఈఓగా పనిచేస్తారనే రిపోర్ట్స్ వస్తున్నాయి.
టాప్ ఉద్యోగుల తొలగింపుతో స్టార్ట్..
గత ఏడు నెలల పాటు మస్క్ ట్విటర్ను కొంటారా? కొనరా? అనే టెన్షన్లో కంపెనీ ఉద్యోగులే కాదు సాధారణ ప్రజలు కూడా ఉన్నారు. చివరికి 44 బిలియన్ డాలర్ల డీల్ను శుక్రవారం అధికారికంగా ఆయన పూర్తి చేశారు. కాగా, యూఎస్ కోర్టు ఇచ్చిన డెడ్లైన్ కూడా శుక్రవారంతోనే ముగిసింది. ఇక ట్విటర్ను టేకోవర్ చేయగానే ఇండియన్ ఆరిజన్ సీఈఓ పరాగ్ అగర్వాల్ను, లీగల్, పాలసీ హెడ్ విజయా గడ్డెను, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగల్ను, ట్విటర్ జనరల్ కౌన్సిల్ మెంబర్ అయిన సీన్ ఎడ్గెట్ను మస్క్ తొలగించారు. ఇక ఎడ్గెట్ను అయితే సెక్యూరిటీని పిలిచి కంపెనీ ఆఫీస్ నుంచి బయటకు పంపారనే వార్తలు వస్తున్నాయి. కంపెనీ ఉద్యోగుల్లో 75 శాతం మందిని తొలగించనని ఆయన ఇప్పటికే ప్రకటించినప్పటికీ, టాప్ ఎగ్జిక్యూటివ్లను తీసేయడంతో ఉద్యోగుల్లో మళ్లీ టెన్షన్ మొదలయ్యింది.
పరాగ్ను ఎందుకు తొలగించారంటే?
పరాగ్ అగర్వాల్, ఎలన్ మస్క్, ట్విటర్ ఫౌండర్ జాక్ డోర్సే మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణలు చూస్తే పరాగ్ను ఎందుకు సీఈఓ పోస్ట్ నుంచి మస్క్ తీసేశారో అర్థమవుతుంది. పరాగ్ అందరినీ మెప్పించాలని చూస్తారని, కొంత మంది ఎంత చేసినా నెగెటెవ్ ఫీలింగ్తోనే ఉంటారని జాక్ డోర్సేతో మస్క్ పేర్కొన్నారు. ఇంకా పరాగ్ విధానాలు స్లో గా ఉన్నాయని కూడా చెప్పారు. మరోవైపు పరాగ్కు, మస్క్కు మధ్య జరిగిన సంభాషణలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ట్విటర్ చనిపోతోంది? అని మస్క్ చేసిన ట్వీట్కు పరాగ్ కొద్దిగా ఘాటుగానే స్పందించిన విషయం తెలిసిందే. ట్విటర్ను మరింత మెరుగ్గా మార్చడంలో ఇది సాయపడదని, తమ సామర్ధ్యానికి తగ్గట్టు పనిచేసుకుందామంటే భాద కలిగిస్తోందని మస్క్కు పరాగ్ రిప్లై ఇచ్చారు. పరాగ్ను తీసేయడానికి ఇదొక కారణమై ఉండొచ్చని అంచనా. మరోవైపు ఇరువురు కూడా కంపెనీ ఇంజినీరింగ్ టీమ్ గురించి బాగా మాట్లాడుకోవడాన్ని చూడొచ్చు.
భారీ మొత్తంలో సెవరెన్స్ ప్యాకేజి..
ఏడాదిలోపు తొలగిస్తే పరాగ్ అగర్వాల్కు 42 మిలియన్ డాలర్ల(రూ.344 కోట్ల) సెవరెన్స్ ప్యాకేజి అందుతుందని రీసెర్చ్ కంపెనీ ఈక్విలర్ ఈ ఏడాది ఏప్రిల్లో అంచనావేసింది. ఈ అంచనాలను ట్విటర్ కొట్టిపారేసింది. అయినప్పటికీ పరాగ్కు పెద్ద మొత్తంలో అందినట్టు తెలుస్తోంది. బిజినెస్ ఇన్సైడర్ రిపోర్ట్ ప్రకారం, సెగల్కు 25.4 మిలియన్ డాలర్లు (రూ.208.28 కోట్లు), విజయకు 12.5 మిలియన్ డాలర్ల (రూ.102.5 కోట్ల) సెవరెన్స్ ప్యాకేజి అందింది. ట్విటర్లో లైఫ్ టైమ్ బ్యాన్ పాలసీని తీసేస్తామని మస్క్ ప్రకటించారు. యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, బాలివుడ్ నటి కంగనా రనౌత్లపై లైఫ్ టైమ్ బ్యాన్ను గతంలో ట్విటర్ విధించింది. దీన్ని ఎత్తేయనున్నారు.
ఈ పక్షులను ఎగరనివ్వండి..
పక్షికి స్వేచ్చ దొరికింది..అంటూ ట్విటర్ కొన్న తర్వాత మస్క్ చేసిన ట్వీట్కు ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్రా, పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ స్పందించారు. ‘ఈ పక్షులను ఫ్రీగా ఎగరనివ్వండి. మీవి అనుకునేవి మీ దగ్గరకు ఏదో ఒకరోజు తిరిగి వస్తాయి’ అని మిర్జా ఘలిబ్ లైన్స్ను ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. విజయ్ శేఖర్ శర్మ మస్క్కు శుభాకాంక్షలు చెప్పారు. అన్ని చోట్ల, అందరూ అతనిపై చాలా అంచనాలు పెట్టుకున్నారని, ట్విటర్ను సేఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్గా మారుస్తారనే నమ్మకం ఉందని ట్వీట్ చేశారు.
ట్విటర్ లోకల్ రూల్స్ను ఫాలో కావాల్సిందే: ప్రభుత్వం
లోకల్ రూల్స్కు తగ్గట్టు ట్విటర్ పనిచేయాలని, మస్క్ టేకోవర్ చేసినంత మాత్రాన ఇందులో మార్పు ఉండదని స్కిల్ డెవలప్మెంట్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ట్విటర్ను ఎవరు కొన్నా మన రూల్స్, చట్టాల్లో మార్పు ఉండదని, వీటిని కంపెనీ ఫాలో కావాల్సిందేనని వివరించారు. కాగా, ప్రభుత్వం తెచ్చిన ఐటీ రూల్స్ను ఫాలో కావడంలో ట్విటర్ అభ్యంతరం చెబుతున్న విషయం తెలిసిందే. ఐటీ శాఖకు, ట్విటర్కు మధ్య ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. ప్రభుత్వం 2021, ఫిబ్రవరి నుంచి జూన్,2022 మధ్య తీసుకొచ్చిన 39 ఆర్డర్లను సవాలు చేస్తూ ట్విటర్ కర్నాటక హై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.