చూపు కోల్పోయిన వారికి మళ్లీ చూపు వస్తే..
పక్షవాతం వచ్చిన వారు మళ్లీ పూర్వంలా కోలుకుంటే..
పార్కిన్ సన్స్, మతిమరుపు, అల్జీమర్స్ వంటి మొండి వ్యాధులకు ప్రభావవంతమైన చికిత్స సాధ్యమైతే.. గొప్ప అద్భుతమే కదా!
అధునాతన టెక్నాలజీతో ఈ అద్భుతాలను చేసి చూపించే దిశగా అపర కుబేరుడు ఎలాన్ మస్క్ అడుగులు వేస్తున్నారు. టెస్లా.. స్పేస్ ఎక్స్.. ట్విట్టర్ వంటి దిగ్గజ కంపెనీల అధినేతగా ఖ్యాతి గడించిన మస్క్తన మరో కంపెనీ ‘న్యూరాలింక్’ తో కనీవినీ ఎరుగని సరికొత్త సంచలనాలకు తెర తీసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాడు. మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చేందుకు సంబంధించిన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ (బీసీఐ) టెక్నాలజీని అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేయబోతున్నాడు. బీసీఐ టెక్నాలజీతో ఇప్పటికే జంతువులపై ప్రయోగ పరీక్షలు పూర్తిచేసిన న్యూరాలింక్ కంపెనీ.. మరో 6 నెలల్లోగా మనుషులపైనా ట్రయల్స్ ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. కాలిఫోర్నియాలోని ఫ్రెమోంట్ లో ఉన్న న్యూరాలింక్స్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఓ సమావేశంలో మస్క్ ఈవిషయాన్ని స్వయంగా వెల్లడించారు.బ్రెయిన్ లోని ఎలక్ట్రానిక్ చిప్ ను అమర్చేందుకు సంబంధించిన టెక్నాలజీతో మనుషులపై ప్రయోగాలు చేసేందుకు సంబంధించి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ)తో సంప్రదింపులు ఆశాజనక రీతిలో జరిగాయని తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(కృత్రిమ మేధ) ను అధిగమించేలా మానవ మేధస్సును పెంచే లక్ష్యంతో బ్రెయిన్ చిప్ ప్రాజెక్టును మస్క్ ముందుకు తీసుకుపోతున్నారు.
మస్క్ చేయలేనిది.. మరో కంపెనీ చేసింది
వాస్తవానికి బ్రెయిన్ చిప్ టెక్నాలజీతో మనుషులపై ట్రయల్స్ కు 2020 చివరికల్లా అమెరికా ఎఫ్డీఏ నుంచి అనుమతులు వస్తాయని మస్క్ భావించారు. కానీ అలా జరగలేదు. ఇదే సమయంలో మరో అమెరికా కంపెనీ ‘సింక్రాన్’ విప్లవాత్మకంగా పురోగమించింది. మస్క్ కంపెనీ న్యూరాలింక్ చేయలేనిది .. చేసి చూపించింది. మెదడు, నరాల సంబంధిత వ్యాధులు, పక్షవాతంతో బాధపడుతున్న నలుగురు ఆస్ట్రేలియన్ల మెదడులో చిప్ ను అమర్చి సింక్రాన్ కంపెనీ పరీక్షించింది.
ప్రపంచంలోనే తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఓ వ్యక్తి మెదడులో చిప్ ను అమర్చిన ఘనతను సైతం 2022 జులై 19న సింక్రాన్దక్కించుకుంది. న్యూయార్క్ సిటీలోని మౌంట్ సినాయ్ వెస్ట్ హాస్పిటల్ లో దీనికి సంబంధించిన సర్జరీని సింక్రాన్ కంపెనీ వైద్య నిపుణులు నిర్వహించారు. దాదాపు 2 గంటలపాటు ఆ అరుదైన సర్జరీ జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈఏడాదిలో ఒకానొక దశలో సింక్రాన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలని ఎలాన్ మస్క్ నిర్ణయించుకున్నారు. దీనిపై సింక్రాన్ కంపెనీ వ్యవస్థాపకుడు థామస్ ఆక్స్ లేతో నేరుగా కలిసి మాట్లాడారు. అయితే ఆ చర్చలు ఎక్కడిదాకా వచ్చాయనేది తెలియరాలేదు.