నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్​కు ఎమర్జెన్సీ పంపింగ్

నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్​కు ఎమర్జెన్సీ పంపింగ్
  •  ప్రారంభించిన వాటర్​బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డి
  • సిటీకి ​నీటి కొరత రాదంటున్న  అధికారులు 
  •  10 పంపుల ద్వారా పంపింగ్.. అవసరమైతే రెండో దశకూ సిద్ధం
  • వచ్చే నెల 15 నుంచి ఎల్లంపల్లి జలాశయం నుంచి ఎమర్జెన్సీ పంపింగ్

హైదరాబాద్,వెలుగు:  గ్రేటర్​ హైదరాబాద్‌కు తాగునీటి కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, వినియోగదారులు ఆందోళన చెందొద్దని మెట్రోవాటర్​బోర్డు అధికారులు భరోసా ఇచ్చారు. నాగార్జునసాగర్​నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ ​ప్రారంభమైందని తెలిపారు. హైదరాబాద్​కు ప్రధాన నీటి వనరుగా ఉన్న నాగార్జునసాగర్ లో నీటి మట్టాలు పడిపోవడంతో డెడ్ ​స్టోరేజీ నుంచి సిటీకి ఎమర్జెన్సీ పంపింగ్​ పనులను అధికారులు పూర్తి చేశారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 508 అడుగులకు చేరింది. దీంతో నీటి సరఫరాకు ఆటంకం కలుగుతోంది. దీంతో అధికారులు పుట్టంగండి వద్ద డెడ్​స్టోరేజీ నుంచి  ఎమర్జెన్సీ పంపింగ్​కు పనులను పూర్తిచేయగా..10 పంపులను ఉన్నతాధికారుల సమక్షంలో మెట్రోవాటర్​బోర్డు ఎండీ సుదర్శన్​రెడ్డి  శనివారం ప్రారంభించారు.  నాగార్జునసాగర్ లో నగర తాగునీటి అవసరాల కోసం ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించామని, అవసరమైతే రెండో దశ అత్యవసర పంపింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. నీటిలో తేలియాడే సబ్ మెర్సిబుల్ పంపుల ద్వారా నీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. దీని వల్ల ఎక్కడ నీరు ఎక్కువ ఉందో ఆ ప్రాంతాల నుంచి నీటిని తోడేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. 

ఏడేండ్ల తర్వాత నాగార్జునసాగర్​ నుంచి పంపింగ్

హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలను తీరుస్తున్న నాగార్జునసాగర్​ నుంచి కృష్ణా ప్రాజెక్టు మూడు దశల ద్వారా నీటిని తరలిస్తున్నారు. అయితే, గత ఏడేండ్ల కాలంలో సాగర్​ నుంచి పంపింగ్​ చేసే పరిస్థితి ఏర్పడలేదు. సకాలంలో వర్షాలు పడడం, జలాశయంలో పుష్కలంగా నీరు ఉండడంతో సమస్యలు రాలేదు. కానీ నిరుడు వర్షాలు తక్కువగా పడడంతో జలాశయంలో తగిన నీటి నిల్వలు లేకుండాపోయాయి. నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో ఈ ప్రభావం హైదరాబాద్ తాగునీటి అవసరాలపై  పడకుండా ఉండేందుకు ఏడేండ్ల తర్వాత అత్యవసర పంపింగ్ ప్రారంభించారు. చివరి సారిగా 2017లో పంపింగ్ చేశారు. సాగర్ జలాశయంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టగండి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని లిఫ్ట్ చేసి అక్కంపల్లి బ్యాలెన్సింగ్  రిజర్వాయర్​కు తరలించి.. తిరిగి అక్కడి నుంచి కోదండాపూర్​ ట్రీట్​మెంట్​ప్లాంట్ కు తరలిస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అయితే శనివారం నాటికి నాగార్జున సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 127.630 టీఎంసీలు ఉండగా ( 507.600 అడుగులు).. నిరుడు ఇదే రోజున 156.670 టీఎంసీలు(524.000 అడుగుల) మేరకు నీరు ఉంది. నిరుడితో పోలిస్తే ఈ ఏడాది నగరానికి సరఫరా చేసే సామర్థ్యం 2,600 ఎంఎల్​డీలకు పెంచారు. ఈ సంవత్సరం 175 ఎంఎల్​డీల అదనపు నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు వివరించారు. 

హైదరాబాద్‌‌కు రోజుకు 270 ఎంజీడీల నీటి సరఫరా

గ్రేటర్​ హైదరాబాద్​ సిటీకి నాగార్జునసాగర్​ నుంచి  కృష్ణా ప్రాజెక్టు మూడు దశల ద్వారా రోజుకు 270 ఎంజీడీ (మిలియన్​ గ్యాలన్స్ ఫర్​ డే) నీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా సాగర్​ నుంచి అక్కంపల్లి రిజర్వాయర్​కు నీటిని తరలిస్తారు. తిరిగి అక్కడి నుంచి కోదండాపూర్ లోని నీటి శుద్ధి కేంద్రానికి పంపింగ్​చేస్తారు. అక్కడ శుద్ధి చేసిన నీటిని హైదరాబాద్​ నగర శివారులోని బొంగుళూరు బ్యాలెన్సింగ్​ రిజర్వాయర్​కు తరలించి, అక్కడి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం సాగర్​లో  నీటి నిల్వలు భారీగా అడుగంటడంతో సాగర్​లోని పుట్టంగండి వద్ద పంపింగ్​ ఏర్పాట్లు చేసి, నీటిని నేరుగా కోదండాపూర్​ నీటి శుద్ధి కేంద్రానికి తరలిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్​హైదరాబాద్​ పరిధిలో నాగార్జునసాగర్​ నుంచి కృష్ణా ప్రాజెక్టు, ఎల్లం పల్లి నుంచి గోదావరి ప్రాజెక్టు, సింగూరు, మంజీరా, ఉస్మాన్​సాగర్, హిమాయత్​ సాగర్​ల నుంచి రోజుకు 500 ఎంజీడీల నీరు సరఫరా అవుతోంది. ప్రధానంగా నాగార్జునసాగర్​ నుంచే 270 ఎంజీడీలు సరఫరా అవుతుండడం గమనార్హం. హైదరాబాద్​ నీటి అవసరాలు 50 శాతం నాగార్జునసాగర్​ ద్వారానే తీరుతున్నాయి.  కాగా, వచ్చే నెల 15 తేదీ నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్​ నుంచి గోదావరి జలాల  అత్యవసర పంపింగ్ ప్రారంభిస్తున్నట్టు అధికారులు వివరించారు.  ఇదే కాకుండా.. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, సింగూరు జలాశయాల్లో పుష్కలంగా నీరుందని.. హైదరాబాద్ నగర తాగునీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని చెప్తున్నారు. అవసరమైతే రెండు రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా తాగునీరు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.  దీంతో ఈ వేసవి కాలం వెళ్లే వరకూ ముఖ్యంగా జూన్​ఆఖరు నాటికి హైదరాబాద్​ నగరానికి నీటి ఎద్దడి అన్నది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.