హైదరాబాద్, వెలుగు : సన్ పరివార్ ఇన్వెస్ట్మెంట్ మోసాల కేసులో రూ.25 కోట్లు విలువ చేసే ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. తమ సంస్థల్లో పెట్టుబడులు పెడితే తక్కువ టైంలోనే ఎక్కువ లాభాలు ఇస్తామని సన్ పరివార్ ప్రతినిధులు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం అక్కారం గ్రామానికి చెందిన మెతుకు రవీందర్,అతని కుటుంబ సభ్యులు ప్రచారం చేసుకున్నారు.
రాష్ట్రంలో 10 వేల మంది నుంచి రూ.158 కోట్లు వసూలు చేశారు. ఏడాదికి 100 శాతం అధిక లాభాలు ఇస్తామని మోసం చేశారు. బాధితుల ఫిర్యాదుతో 2018 డిసెంబర్లో సైబరాబాద్ పోలీసులు కేసు ఫైల్ చేసి, నిందితులను రిమాండ్కి తరలించారు. ఈ కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ యాక్ట్ కింద కేసు పెట్టింది.
మెతుకు రవీందర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఇతరులకు చెందిన ఆస్తులను తాజాగా అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు సోమవారం వెల్లడించారు.