
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని హెరాల్డ్ హౌజ్ బిల్డింగ్ లో ఉన్న యంగ్ ఇండియన్ ఆఫీస్ కు ఈడీ సీల్ వేసింది. తమ అనుమతి లేనిదే ఆఫీస్ ఓపెన్ చేయొద్దని ఆదేశించింది. సోదాల సమయంలో ఆఫీసులో ఎవరు లేకపోవడంతో సీల్ వేసిన అధికారులు..తమ అనుమతి లేనిదే ఓపెన్ చేయొద్దని సూచించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలను ఈడీ ఇప్పటికే విచారించింది.
12చోట్ల ఈడీ సోదాలు
కాంగ్రెస్కు చెందిన నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ హెడ్ ఆఫీసు సహా దేశవ్యాప్తంగా 12 చోట్ల ఈడీ సోదాలు జరిపింది. ‘‘మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎమ్ఎల్ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద అదనపు సాక్ష్యాలను సేకరించేందుకు, నేషనల్ హెరాల్డ్తో లావాదేవీలు చేసిన సంస్థల గురించి తెలుసుకునేందుకు తనిఖీలు చేపట్టాం’’ అని అధికారులు తెలిపారు. మనీ ల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా పలువురిని విచారించిన తర్వాత లభించిన తాజా సాక్ష్యాధారాల నేపథ్యంలో రెయిడ్స్ చేస్తున్నట్లు వివరించారు. సెంట్రల్ ఢిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్లో ఉన్న హెరాల్డ్ బిల్డింగ్లో సోదాలు జరిపారు. కోల్కతాలో ఉన్న ఒక షెల్ కంపెనీలోనూ సర్చ్ చేసినట్లు అధికారులు చెప్పారు.
ప్రతిపక్షంపై దాడి: కాంగ్రెస్
ఈడీ రెయిడ్స్ పేరుతో కక్ష సాధింపునకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. దేశంలోని ప్రధాన ప్రతిపక్షంపై జరుగుతున్న నిరంతర దాడుల్లో భాగమే ఈ చర్య అని మండిపడింది. ‘‘మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారు. ఈ చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు మమ్మల్ని మౌనంగా ఉంచలేరు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. అసలు ఈ కేసులో నగదు లావాదేవీలే జరగనప్పుడు.. మనీ ల్యాండరింగ్ ఎలా జరుగుతుందని రాజస్థాన్ సీఎం గెహ్లాట్ ప్రశ్నించారు. ఈడీ ద్వారా కాంగ్రెస్ను అప్రతిష్టపాలు చేయాలని కేంద్రం ఎంత ప్రయత్నించినా చివరికి నిజమే గెలుస్తుందన్నారు.
ప్రజల సొమ్ము దోచుకున్నోళ్లను వదలం: బీజేపీ
కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారంటూ చేస్తున్న ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని చెప్పింది. కొందరు రాజకీయ నాయకులు అక్రమంగా సంపాదించిన నగదు, ఆస్తులు ఇటీవల బయటపెట్టడాన్ని ప్రస్తావించింది. ప్రజల సొమ్మును స్వాహా చేసిన వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది. రాజ్యాంగ విలువలను బీజేపీ ఎన్నటికీ అతిక్రమించబోదని, దర్యాప్తు సంస్థల పనిలో జోక్యం చేసుకోబోదని పేర్కొంది.