
హైదరాబాద్, వెలుగు: ఆరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల మోత మోగనుంది. గత బ్లాక్ పీరియడ్లో నిర్ణయించిన ఫీజు గడువు ముగియడంతో ఫీజులు పెంచాలని కోరుతూ ఆరు కాలేజీలు కోర్టు మెట్లెక్కాయి. దీంతో కొన్ని షరతులతో ఫీజును పెంచుకునేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఆ ఆరు కాలేజీలకు అనుకూలంగా తీర్పు రావడంతో మరో 50 కాలేజీలూ అదే బాటలో వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)కి చైర్మన్ లేకపోవడమే ఈ ఫీజుల పెంపుకు కారణమన్న విమర్శలొస్తున్నాయి. మూడేళ్ల కింద 2016–17 నుంచి 2018–19 విద్యా సంవత్సరం వరకు ఇంజనీరింగ్ సహా అన్ని వృత్తి విద్యా కాలేజీల ఫీజులను ఏఎఫ్ఆర్సీ నిర్ణయించింది. కన్వీనర్ కోటాలో ₹35 వేల నుంచి ₹1.13 లక్షల వరకు ఫీజుకు పరిమితిని పెట్టింది. ప్రస్తుతం ఆ గడువు తీరిపోయింది.
కొత్త ఫీజులను నిర్ణయించాలి. కానీ ఏఎఫ్ఆర్సీ చైర్మన్ లేక.. కాలేజీల ఆదాయ వ్యయాలను ఉన్నత విద్యామండలి సేకరించింది. విద్యా సంవత్సరం మొదలవుతున్నా ఏఎఫ్ఆర్సీకి చైర్మన్ ను నియమించక పోవడంతో పాత ఫీజులనే కొనసాగిస్తారన్న ప్రచారం జరిగింది. దీంతో వర్థమాన్ ఇంజనీరింగ్ కాలేజీ, గోకరాజు రంగరాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీనిధి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సీవీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, కేశవ్ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఆ కాలేజీలు ప్రతిపాదించిన ఫీజులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భవిష్యత్తులో మాత్రం ఏఎఫ్ఆర్సీ నిర్ణయానికి లోబడే ఫీజులు ఉండాలని షరతు పెట్టింది. ఇప్పుడున్న ఫీజు కన్నా తక్కువగా నిర్ణయిస్తే, విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులో మిగతా మొత్తాన్ని తిరిగిచ్చేయాలని సూచించింది.
అయితే, తీర్పుపై అప్పీల్కు వెళ్లే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఫీజుల పెంపుపై ఇప్పటికీ క్లారిటీ లేకపోవడంతో, కాలేజీలే అధికారికంగా 5 శాతం పెంచుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. కానీ, దానికి మేనేజ్మెంట్లు ఆసక్తి చూపించట్లేదు. దీంతో ఆ ఆరు కాలేజీల తరహాలోనే ఇప్పుడు మరో 50 కాలేజీలూ హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. రెండు మూడు రోజుల్లో కోర్టుకు వెళతామని ఓ కాలేజ్ ప్రతినిధి తెలిపారు.