IND vs ENG 2025: బుమ్రా అడ్డుపడినా స్మిత్ ఆదుకున్నాడు.. లార్డ్స్ టెస్టులో భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్

IND vs ENG 2025: బుమ్రా అడ్డుపడినా స్మిత్ ఆదుకున్నాడు.. లార్డ్స్ టెస్టులో భారీ స్కోర్ దిశగా ఇంగ్లాండ్

ఇంగ్లాండ్ తో జరుగుతున్న లార్డ్స్ టెస్ట్ లో టీమిండియా బౌలర్లు రాణించారు. రెండో రోజు తొలి సెషన్ లో బుమ్రా విజృభించినప్పటికీ కార్స్, స్మిత్ భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ కోలుకుంది. ఫలితంగా రెండో రోజు లంచ్ సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. క్రీజ్ లో కార్స్ (33), స్మిత్ (51) ఉన్నారు. రెండో సెషన్ లో త్వరగా టీమిండియా మూడు వికెట్లు తీస్తే మ్యాచ్ పై పట్టు సాధించవచ్చు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టాడు. నితీష్ రెండు.. జడేజాకు ఒక వికెట్ తీసుకున్నారు. ఈ సెషన్ లో ఇంగ్లాండ్ 102 పరుగులు రాబట్టి 3 వికెట్లను కోల్పోయింది.        

251 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ కు మంచి ఆరంభం లభించలేదు. తొలి బంతికే రూట్ ఫోర్ తో తన టెస్ట్ కెరీర్ లో 37 వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ప్రమాదకరంగా మారుతున్న రూట్, స్టోక్స్ జోడీని విడగొట్టి టీమిండియాకు బుమ్రా బ్రేక్ ఇచ్చాడు. 86 ఓవర్ రెండో బంతికి ఒక ఇన్ స్వింగ్ తో స్టోక్స్ (44) ను బుమ్రా బోల్తా కొట్టించాడు. 88 ఓవర్ తొలి బంతికి సెంచరీ హీరో రూట్ ఔటయ్యాడు. బుమ్రా బంతిని డ్రైవ్ చేయాలనీ భావిస్తే ఇన్స్ సైడ్ ఎడ్జ్ తీసుకొని క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత బంతికే వోక్స్ వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

ALSO READ : IND vs ENG 2025: పంత్ స్థానంలో జురెల్ బ్యాటింగ్ చేయవచ్చా.. ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

మొదట వోక్స్ ను అంపైర్ నాటౌట్ అని ప్రకటించినా.. టీమిండియా రివ్యూ తీసుకొని సఫలమైంది. సిరాజ్ ఓవర్లో స్మిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను రాహుల్ చేజార్చడంతో టీమిండియాకు మరో వికెట్ మిస్ అయింది. 271 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను కార్స్, స్మిత్ ఆదుకున్నారు. వీరిద్దరూ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ లంచ్ వరకూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరి జోడీ 8 వ వికెట్ కు అజేయంగా 82 పరుగులు జోడించడం విషయం.