క్లాట్‌‌తో లా యూనివర్సిటీల్లో ఎంట్రెన్స్​

క్లాట్‌‌తో లా యూనివర్సిటీల్లో ఎంట్రెన్స్​

కామన్‌‌ లా అడ్మిషన్‌‌ టెస్ట్‌‌.. సంక్షిప్తంగా క్లాట్‌‌! న్యాయ విద్యను అందించడంలో ప్రతిష్టాత్మక ఇన్‌‌స్టిట్యూట్స్‌‌గా గుర్తింపు పొందిన నేషనల్‌‌ లా యూనివర్సిటీల్లో అడ్మిషన్స్​కు నిర్వహించే పరీక్ష. ఇంటర్మీడియెట్‌‌ అర్హతతో క్లాట్‌‌–యూజీ, ఎల్‌‌ఎల్‌‌బీ అర్హతతో క్లాట్‌‌–పీజీకి అప్లై చేసుకోవచ్చు. ఈ జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాల్లో.. బీఏ ఎల్‌‌ఎల్‌‌బీ పూర్తి చేసుకుంటే.. ఇటు లా కెరీర్‌‌తో పాటు అటు కార్పొరేట్‌‌ కొలువులు సైతం సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో క్లాట్‌‌తో ప్రయోజనాలు, ఎగ్జామ్​ ప్యాటర్న్​, సిలబస్‌‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌‌ గురించి తెలుసుకుందాం..

నోటిఫికేషన్​

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌‌లైన్‌‌లో జులై 1 నుంచి నవంబర్​ 3 వరకు అప్లై చేసుకోవాలి
క్లాట్‌‌ పరీక్ష: డిసెంబర్‌‌ 3న ఎగ్జామ్​ నిర్వహించనున్నారు.
ఎగ్జామ్​ సెంటర్స్​: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో పరీక్ష కేంద్రాలున్నాయి. 
వెబ్‌‌సైట్‌‌: consortiumofnlus.ac.in

కార్పొరేట్‌‌ అవకాశాలు

న్యాయవాద వృత్తి మాత్రమే కాకుండా.. కార్పొరేట్‌‌ కొలువులు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుత అంతర్జాతీయ వాణిజ్య విధానాలు, పలు దేశాల కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలతో న్యాయ నిపుణులకు డిమాండ్‌‌ ఏర్పడింది. క్యాంపస్‌‌లలో రిక్రూట్‌‌మెంట్‌‌ డ్రైవ్స్‌‌లో ఎంపికైన విద్యార్థులకు కన్సల్టింగ్‌‌ సంస్థలు, బ్యాంకులు సగటున రూ.10 లక్షల వార్షిక వేతనం ఆఫర్‌‌ చేస్తున్నాయి. 

క్లాట్‌‌–2024 ద్వారా మొత్తం 24 నేషనల్‌‌ లా యూనివర్సిటీల్లో ప్రవేశం కల్పిస్తారు. గతేడాది 22 వర్సిటీలే ఉండగా..ఈ ఏడాది మరో రెండు యూనివర్సిటీలు క్లాట్‌‌ స్కోర్‌‌తో అడ్మిషన్స్​ కల్పించేందుకు సిద్ధమయ్యాయి. క్లాట్‌‌ యూజీతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌‌ ఎల్‌‌ఎల్‌‌బీ, క్లాట్‌‌ పీజీతో ఎల్‌‌ఎల్‌‌ఎం ప్రోగ్రామ్‌‌లో అడ్మిషన్‌‌ దొరుకుతుంది.

అర్హత: క్లాట్‌‌–యూజీకి దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌‌ ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వేషన్‌‌ కేటగిరీ విద్యార్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. 2023–24లో ఇంటర్‌‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 


క్లాట్‌‌-యూజీ:  గతేడాది వరకు 150 ప్రశ్నలతో ఈ పరీక్ష నిర్వహించగా.. క్లాట్‌‌–యూజీ 2024లో 120 ప్రశ్నలే ఉంటాయని పేర్కొన్నారు. పరీక్ష సమయాన్ని మాత్రం గతంలో మాదిరిగానే రెండు గంటలుగా నిర్ణయించారు. అంటే.. గతంలో రెండు గంటల్లో 150 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటే.. ఈ ఏడాది 2 గంటల వ్యవధిలో 120 ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది. దీంతో  ప్రశ్నల సంఖ్య తగ్గడంతోపాటు ప్రతి ప్రశ్నకు లభించే సమయం పెరుగుతుంది.


ఎగ్జామ్​ ప్యాటర్న్​: క్లాట్‌‌–యూజీ 2024 పరీక్షను అయిదు విభాగాలుగా నిర్వహిస్తారు. ఇంగ్లీష్‌‌ లాంగ్వేజ్‌‌ 22–26 ప్రశ్నలు, జీకే అండ్‌‌ కరెంట్‌‌ అఫైర్స్‌‌ 28–32 ప్రశ్నలు, లీగల్‌‌ రీజనింగ్‌‌ 28–32 ప్రశ్నలు, లాజికల్‌‌ రీజనింగ్‌‌ 22–26 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌‌ టెక్నిక్స్‌‌ 10–14 ప్రశ్నలు ఉంటాయి.  పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌‌ విధానంలో ఉంటుంది. పరీక్షకు కేటాయించిన మార్కులు 120.  ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు. క్లాట్‌‌–యూజీలో పేర్కొన్న అయిదు విభాగాల్లో.. నాలుగు విభాగాలు(ఇంగ్లీష్‌‌ లాంగ్వేజ్, కరెంట్‌‌ అఫైర్స్, లీగల్‌‌ రీజనింగ్, లాజికల్‌‌ రీజనింగ్‌‌)ల్లో పూర్తిగా ప్యాసేజ్‌‌ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. క్వాంటిటేటివ్‌‌ టెక్నిక్స్‌‌ విభాగంలో గ్రాఫ్, టేబుల్స్, డయాగ్రమ్స్‌‌  ప్రశ్నలు ఉంటాయి.


క్లాట్‌‌-పీజీ:నేషనల్‌‌ లా యూనివర్సిటీల్లో ఎల్‌‌ఎల్‌‌ఎం కోర్సు­లో అడ్మిషన్స్​కు క్లాట్‌‌–పీజీ నిర్వహిస్తారు. ఎల్‌‌ఎల్‌‌బీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.  అభ్యర్థులు ఎల్‌‌ఎల్‌‌బీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. రిజర్వ్‌‌డ్‌‌ కేటగిరీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఈ ఏడాది ఫైనల్​ ఇయర్​ చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. క్లాట్‌‌–పీజీ ఎగ్జామ్ 120 ప్రశ్నలు–120 మార్కులకు నిర్వహిస్తారు. ప్యాసేజ్‌‌ ఆధారితంగా ఆబ్జెక్టివ్‌‌ ప్రశ్నలుగా అడుగుతారు. పరీక్షలో కాన్‌‌స్టిట్యూషనల్‌‌ లా సంబంధిత ప్రశ్న­లు, అడ్మినిస్ట్రేటివ్‌‌ లా, లా ఆఫ్‌‌ కాంట్రాక్ట్, టార్ట్స్, ఫ్యామిలీ లా, క్రిమినల్‌‌ లా, ప్రాపర్టీ లా,కంపెనీ లా, పబ్లిక్‌‌ ఇంటర్నేషనల్‌‌ లా, ట్యాక్స్‌‌ లా, ఎన్విరాన్‌‌మెంటల్‌‌ లా, లేబర్‌‌ అండ్‌‌ ఇండస్ట్రియల్‌‌ లా విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ముఖ్యమైన తాజా 

తీర్పులు; రాజ్యాంగ, శాసనపరమైన అంశాలు; చారిత్రాత్మక తీర్పులు, వాటి ప్రభావం వంటి వాటిపై అవగాహన పెంచుకుంటే.. క్లాట్‌‌–పీజీలో మెరుగైన మార్కులు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు తాము ఎంపిక చేసుకోనున్న స్పెషలైజేషన్‌‌కు సంబంధించి అకడమిక్‌‌గా బ్యాచిలర్‌‌ స్థాయిలోని అంశాలపై పట్టు సాధించడం మేలు చేస్తుంది.

సిలబస్​ 

కరెంట్‌‌ అఫైర్స్, జనరల్‌‌ నాలెడ్జ్‌‌: ఈ విభాగంలో సమకాలీన అంశాలు, కళలు, సంస్కృతి, అంతర్జాతీయ వ్యవహారాలు, ప్రాధాన్యత కలిగిన చారిత్రక అంశాలకు సంబంధించిన ప్యాసేజ్‌‌లు ఇచ్చి.. వీటి నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు జాతీయోద్యమంలో కీలక ఘట్టాలపై ఫోకస్​ చేయాలి.  భారత రాజ్యాంగ రూపకల్పన నుంచి తాజా సవరణల వరకు అన్నీ తెలుసుకోవాలి. కరెంట్‌‌ అఫైర్స్‌‌కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ద్వైపాక్షిక ఒప్పందాలు, ముఖ్యమైన సంఘటనలు, సదస్సుల గురించి అవగాహన పొందాలి.


లీగల్‌‌ రీజనింగ్‌‌: అభ్యర్థుల న్యాయపరమైన దృక్పథం, సహేతుక ఆలోచన ధోరణి, నిర్ణయ సామర్థ్యాలను పరిశీలించే విభాగం ఇది. ఇందులో ప్యాసేజ్‌‌ ఆధారిత ప్రశ్నలు అడుగుతారు. సంబంధిత ప్యాసేజ్‌‌ల నుంచి నిబంధనలు, సిద్ధాంతాలు, ఫ్యాక్ట్స్, వాటి ద్వారా చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ముఖ్యమైన చట్టాలు, న్యాయ శాఖకు సంబంధించి ఇటీవల కాలంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలు, లీగల్‌‌ టెర్మినాలజీపై అవగాహన పెంచుకోవాలి. 


లాజికల్‌‌ రీజనింగ్‌‌: ఈ విభాగంలోనూ ప్యాసేజ్‌‌ ఆధారిత ప్రశ్నలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో రాణించాలంటే.. ప్యాసేజ్‌‌ ఆధారిత ప్రశ్నలు; అసెర్షన్‌‌ అండ్‌‌ రీజనింగ్‌‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ఇందుకోసం సిలాజిజమ్, కోడింగ్‌‌–డీ కోడింగ్, డైరెక్షన్, అనాలజీ, సిరీస్, సీటింగ్‌‌ అరేంజ్‌‌మెంట్‌‌ వంటి అంశాలపై అవగాహన పొందాలి. 


క్వాంటిటేటివ్‌‌ టెక్నిక్స్‌‌: ఈ విభాగంలో టాప్‌‌ స్కోర్‌‌ కోసం పదో తరగతి స్థాయిలోని గణిత అంశాలపై గట్టి పట్టు సాధించాలి. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే అర్థమెటిక్‌‌కు కొంత ఎక్కువ వెయిటేజీ కనిపిస్తోంది. కాబట్టి పర్సంటేజెస్, టైమ్‌‌ అండ్‌‌ డిస్టెన్స్, టైమ్‌‌ అండ్‌‌ స్పీడ్, యావరేజ్, రేషియోస్‌‌ తదితర టాపిక్స్‌‌ను బాగా ప్రాక్టీస్‌‌ చేయాలి. దీంతోపాటు గ్రాఫ్‌‌లు, చార్ట్‌‌లను విశ్లేషించే నైపుణ్యం సొంతం చేసుకోవాలి.


ఇంగ్లీష్‌‌ లాంగ్వేజ్‌‌: ఈ విభాగంలో ఇంగ్లీష్‌‌ భాషా నైపుణ్యాన్ని పరిశీలించే ప్యాసేజ్‌‌ ఆధారిత ప్రశ్నలు ఉంటాయి. ఇందులో రాణించేందుకు కాంప్రహెన్షన్, ప్యాసేజ్‌‌ రీడింగ్‌‌పై పట్టు పెంచుకోవాలి. సునిశిత పరిశీలన నైపుణ్యం, ఇచ్చిన ప్యాసేజ్‌‌ సారాంశాన్ని గ్రహించడం, ఈ ప్యాసేజ్‌‌ ప్రధాన ఉద్దేశం తెలుసుకునే నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం జనరల్‌‌ ఎస్సేలు, న్యూస్‌‌ పేపర్‌‌ ఎడిటోరియల్స్‌‌ చదవాలి. 

- వెలుగు ఎడ్యుకేషన్​ డెస్క్​