బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ
ముషీరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీకి సీఎం పదవి, ఎస్సీ ఎస్టీలకు డిప్యూటీ సీఎం పదవులు ప్రకటించిన పార్టీలకే తమ మద్దతు ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 50% సీట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విద్యానగర్ బీసీ భవన్లో జరిగిన వివిధ బీసీ సంఘాల సమావేశానికి హాజరై మాట్లాడారు. రాజ్యాంగంలోని ప్రధాన అంశాలైన సోషలిజం, సెక్యులరిజం, ప్రజాస్వామ్యానికి తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
కామన్ సివిల్ కోడ్ ను ఎందుకు అడ్డుపడుతున్నారని కేసీఆర్ను ప్రశ్నించారు. దీనిపై మాట్లాడే నైతిక అర్హత సీఎంకు లేదన్నారు. కామన్ సివిల్ కోడ్ కు కేసీఆర్ అడ్డు వస్తుంటే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ప్రజా వ్యతిరేక అంశాల్లో కేసీఆర్, ఒవైసీల మధ్య జరుగుతున్న సమావేశాలు నిజాం హయాంలో నవాబుల అధికార సుస్థిరతకు అద్దం పడుతున్నదని సత్యనారాయణ పేర్కొన్నారు.