
- బ్యాంకును తప్పక సంప్రదించాలె
బిజినెస్డెస్క్, వెలుగు: ఇల్లు, కారు, పర్సనల్ వంటి లోన్ల ఈఎంఐ (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్) కట్టకుంటే చాలా చిక్కులు ఉంటాయి. లోన్ రకం, లోన్ అగ్రిమెంట్లోని రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయి. ఒక్కో బ్యాంకుకు ఒక్కోరకమైన విధానాలు ఉంటాయి. ఈఎంఐ చెల్లించలేకపోతే నేరుగా మీ బ్యాంక్ని సంప్రదించడం చాలా అవసరం. బ్యాంకు ద్వారా అన్యాయం జరుగుతోందని మీరు భావిస్తే, మీరు ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. లోన్ ఈఎంఐని మిస్ అయితే సాధారణంగా ఇలాంటి చర్యలు ఉంటాయి.
లేట్పేమెంట్ చార్జీలు: ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంక్ సాధారణంగా లేట్పేమెంట్ చార్జీలను విధిస్తారు. ఈ చార్జీలు ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా ఉంటాయి. కొన్ని బ్యాంకులు కొంతం మొత్తం వసూలు చేస్తాయి. మరికొన్ని బ్యాంకులు బకాయి ఉన్న ఈఎంఐలో కొంత శాతం మొత్తాన్ని లేట్పేమెంట్ చార్జీగా విధిస్తాయి.
ఫ్యూచర్ లోన్ అప్లికేషన్లపై ప్రభావం: మీరు అదే బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థలతో భవిష్యత్తులో లోన్ల కోసం దరఖాస్తు చేస్తే సమస్యలు ఉంటాయి. మీ ఈఎంఐ చెల్లింపుల చరిత్ర మీ లోన్ అప్లికేషన్పై ప్రభావం చూపవచ్చు. బ్యాంకులు మిమ్మల్ని హై క్రెడిట్ రిస్క్గా చూడవచ్చు.
క్రెడిట్ స్కోర్ ప్రభావం: చెల్లించని ప్రతి ఈఎంఐ మీ క్రెడిట్ స్కోర్పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. భవిష్యత్ లోన్లు లేదా క్రెడిట్ అప్లికేషన్ల కోసం మీ క్రెడిట్ వర్దీనెస్ను నిర్ణయించడంలో మీ క్రెడిట్ స్కోర్ కీలకం. తక్కువ క్రెడిట్ స్కోర్ వల్ల భవిష్యత్తులో లోన్ పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
రిమైండర్ కాల్స్, మెసేజ్లు: కాల్స్, మెసేజ్లు లేదా ఈ–మెయిల్ల ద్వారా రిమైండర్ల ద్వారా కట్టని ఈఎంఐ గురించి బ్యాంక్లు గుర్తుచేస్తాయి. వీలైనంత త్వరగా డబ్బు కట్టాలని కోరుతాయి. అయినా చెల్లించకుంటే మీకు వార్నింగ్ లెటర్ను పంపవచ్చు. మీరు డిఫాల్ట్ కావడం వల్ల ఏమవుతుందో మీకు తెలియజేస్తుంది.
పెనాల్టీ వడ్డీ: కొన్ని బ్యాంకులు కిస్తీల బకాయి మొత్తానికి పెనాల్టీ వడ్డీని విధించవచ్చు. సాధారణ ఈఎంఐ రేటుతో పోలిస్తే ఇది అధికంగా ఉంటుంది. బకాయి మొత్తం చెల్లించే వరకు వర్తిస్తుంది.
చట్టపరమైన చర్యలు: ఈఎంఐలు ఆగిపోతే బాకీ ఉన్న మొత్తాన్ని తిరిగి పొందడానికి బ్యాంక్ మీపై చట్టపరమైన చర్యలను ప్రారంభించవచ్చు. మొదట లీగల్ నోటీసులను పంపుతుంది. చట్టం ప్రకారం రికవరీ ప్రొసీడింగ్లను ప్రారంభిస్తుంది.
ఆర్బీఐ ఏం చెబుతోందంటే..
బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్బీఎఫ్సీలు) పెనాల్టీ వడ్డీలను ఆదాయాన్ని పెంచుకునే మార్గంగా చూడటంపై ఆర్బీఐ ఆందోళన ప్రకటించింది. కిస్తీ కట్టకుంటే బ్యాంకులు 'సహేతుకమైన' జరిమానాలను, చార్జీలను మాత్రమే విధించాలని స్పష్టం చేసింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు వచ్చే జనవరి నుంచి పెనాల్టీ వడ్డీని విధించకుండా నిరోధించింది. లోన్ కాంట్రాక్టు మెటీరియల్ రూల్స్, చార్జీలు, వడ్డీల విధింపున్యాయబద్ధంగా ఉండాలని సూచించింది. ఫిక్స్డ్ఇంట్రెస్ట్రేటు విధానంలో అప్పులు తీసుకొని చెల్లించకుంటే కిస్తీల పద్ధతిలో వసూలు చేయాలని స్పష్టం చేసింది. లోన్లు ఇచ్చేటప్పుడే బ్యారోవర్ ఆర్థిక పరిస్థితిని ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని సూచించింది.