
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా రెండు వారాల కింద కురిసిన చెడగొట్టు వానలకు యాసంగి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కేసీఆర్, మంత్రులు హెలికాప్టర్లో ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఎకరానికి రూ.పది వేల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకుంటామని ప్రకటించారు. అయినా, ఇప్పటిదాకా పంట నష్టం లెక్కలు తేలలేదు. మొక్కజొన్న, మిర్చి, వరి, కూరగాయలు, మామిడి, బొప్పాయి, ఉల్లి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
భారీ సైజులో వడగండ్లు పడటంతో మామిడి కాయలు నేల రాలగా, మొక్కజొన్న, వరి పొలాలు అడ్డం పడ్డాయి. అకాల వర్షాలు రైతుల కండ్లల్లో కన్నీరు మిగిల్చాయి. ప్రధానంగా కరీంనగర్, వరంగల్, వికారాబాద్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, మెదక్, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం వంటి జిల్లాల్లోని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఎప్పుడు అందుతుందా అని ఎదురుచూస్తున్నారు. పంట నష్టంపై 33 రకాల వివరాలు సేకరించి వెంటనే నివేదిక పంపించాలని ఏఈవోలను కలెక్టర్లు ఆదేశించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిబంధనల మేరకు సర్వే నంబర్ల వారీగా నష్టం వివరాలు సేకరిస్తున్నారు. రెండు వారాలైనా సర్వే పూర్తి కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.