
- పోలీసులకు సరైన సైబర్ స్కిల్స్ లేకపోవడంతో దర్యాప్తులో సవాళ్లు
- ప్రైవేటు ఏజెన్సీలు, ఎథికల్ హ్యాకర్ల సాయంతో ఇన్వెస్టిగేషన్
- సిబ్బందికి సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ట్రైనింగ్
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాలు పోలీసులకు సవాల్గా మారాయి. రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ పై తప్ప సైబర్ స్కిల్స్పై పోలీసులకు పట్టు లేకపోవడంతో కేసులు అటకెక్కుతున్నాయి. ఏటా నమోదయ్యే కేసుల్లో కేవలం 10 శాతం మాత్రమే పరిష్కారం అవుతున్నాయి. ఇలా రూ. వందల కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లను ట్రేస్ చేయడంలో పోలీసులు ఇబ్బందులకు గురవుతున్నారు. కేసుల దర్యాప్తులో ప్రైవేట్ ఎథికల్ హ్యాకర్స్, నెట్వర్కింగ్ ఎక్స్పర్ట్స్ సాయం తీసుకుంటున్నారు. హ్యాకింగ్స్, చైనా కేంద్రంగా జరుగుతున్న ఆన్లైన్ గేమింగ్, లోన్ యాప్స్ లాంటి తీవ్రమైన నేరాల్లో పోలీసులు ప్రైవేట్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. ఇందుకు కారణం సైబర్ నేరగాళ్లను ట్రేస్ చేయడంలో అవసరమైన శిక్షణ వారికి లేకపోవడమే.
రాష్ట్రంలో ప్రతి రోజు 250 మంది బాధితులు
ఆన్లైన్ అడ్డాగా సాగుతున్న సైబర్ మోసాల్లో నేరగాళ్లు లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కూడా గుర్తించలేని విధంగా హ్యాకింగ్ యాప్స్ను సర్క్యులేట్ చేస్తున్నారు. దాదాపు 185 రకాలకు పైగా ఆర్థికపరమైన సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా రాష్ట్రంలో రోజుకు 250మంది బాధితులు సైబర్ మోసాల బారిన పడుతున్నారు. 2021 జూ న్ 16 నుంచి ఈ ఏడాది మార్చి 7వ తేదీ వరకు రాష్ట్రంలో 73,909 కేసులు రిపోర్ట్ అయ్యాయి. వీటిలో కేసుల తీవ్రతను బట్టి17,899 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది 8 ట్రిలియన్ డాలర్లను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టినట్టు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది. 2025 నాటికి10.5 ట్రిలియన్స్ దోచేసే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నది.
అక్షరం రాకున్నా ఆన్లైన్ మోసాలు..
చైనా సహా దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో లోన్యాప్స్, స్పూఫింగ్, ఫిషింగ్మెయిల్స్, క్లోనింగ్, ఓటీపీ, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఎక్కువగా ఉన్నాయి. రాజస్థాన్లోని భరత్పూర్, వెస్ట్ బెంగాల్కు చెందిన సైబర్ నేరగాళ్లు అక్షరం రాకున్నా ఆన్లైన్లో దోచేస్తున్నారు.ఏటేటా పెరిగిపోతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్టవేయడానికి అవసరమైన టెక్నికల్ స్కిల్, అధునాతన సాఫ్ట్వేర్ను వాడటంలో రాష్ట్ర పోలీసులకు తగినంత స్కిల్ లేదు. పోలీసుల కంటే ముందుగానే సైబర్ నేరగాళ్లు అప్డేట్అవుతున్నారు. దీంతో సైబర్ క్రైమ్ కేసుల్లో ఆశించిన స్థాయిలో నిందితుల అరెస్ట్ జరగడం లేదు. నేరాలను అరికట్టే అవకాశం లేకుండా పోతున్నది. ఈ క్రమంలో బాధితుల సంఖ్యపెరిగిపోతున్నది.
సైబర్ క్రైమ్ బ్యూరోలో ప్రైవేట్ ఎక్స్పర్ట్స్
కేసుల దర్యాప్తులో పోలీసులు ప్రైవేట్ ఏజెన్సీలపై ఆధారపడుతున్నారు. ఎథికల్ హ్యాకర్లను తమ ఇన్వెస్టిగేషన్లో వాడుతున్నారు. స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో పలు విభాగాలకు ఎక్స్పర్ట్స్ను నియమించారు. ప్రభుత్వ, ఐటీ కంపెనీలు, బ్యాంక్స్, ఇతర కార్పొరేట్ కంపెనీలపై జరిగే సైబర్ అటాక్స్ ను గుర్తించేలా ల్యాబ్ ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధునాతన సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా సైబర్ అటాక్స్ను గుర్తించనున్నారు. ఎలాంటి సైబర్ అటాక్స్ జరిగినా ట్రాక్ చేసేందుకు ప్రత్యేక టూల్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ను తయారు చేశారు.ఇవన్నీ సైబర్క్రైమ్ పోలీసులకు ఇన్వెస్టిగేషన్లో సాయపడనున్నాయి. అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో పోలీసులకు ట్రైనింగ్ ఇస్తున్నారు.
చైనా కేంద్రంగా జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్ కేసుల దర్యాప్తులో సిటీ పోలీసులు ప్రైవేట్ ఏజెన్సీల సహకారం తీసుకున్నారు. యాప్ లింక్స్ను గుర్తించేందుకు ఆన్లైన్ యాప్ డెవలపర్స్, ఐటీ ఎక్స్పర్ట్స్తో కలిసి ఇన్వెస్టిగేషన్ చేశారు. చైనాకు చెందిన ‘లీ లౌ, గుయాంగ్జౌ.నన్ ఏ, కెవిన్ జూన్’ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కోసం స్పెషల్ యాప్స్ క్రియేట్ చేసినట్లు గుర్తించారు. వీరి గ్యాంగ్ కు చెందిన మొత్తం 9 మందిని జులై 22న అరెస్ట్ చేశారు. కానీ చైనీయులను మాత్రం పట్టుకోలేకపోయారు.’
గతేడాది జనవరిలో మహేష్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వర్ హ్యాక్ అయ్యింది. ఫిషింగ్ మెయిల్తో సైబర్ నేరగాళ్లు రూ.12.4 కోట్లు కొట్టేశారు. ఈ కేసులో 100 మంది పోలీసులు 14 రాష్ట్రాల్లో సెర్చ్ ఆపరేషన్ చేశారు. సాఫ్ట్వేర్ స్కిల్స్ లేకపోవడంతో ప్రైవేట్ ఎథికల్ హ్యాకర్స్ను వినియోగించారు. వర్చువల్ ఐపీలతో విదేశాల నుంచి హ్యాకింగ్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం మొత్తం రూ.58 లక్షలు ఖర్చు చేశారు.’