రెడ్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇయ్యాలె

రెడ్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇయ్యాలె

భూమిలేని ఫ్యామిలీలకు భూమివ్వాలి

అగ్రి చట్టాల్లో మార్పులకు కేంద్రం రెడీగా ఉంది

కేంద్ర సామాజిక, న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథావాలే

హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్రలో మరాఠాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించినట్లే, తెలంగాణలో కూడా రెడ్డి కులస్తులకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రి రాందాస్ అథావాలే అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనన్నారు. తెలంగాణలో భూమి లేని కుటుంబాలు చాలా ఉన్నాయని, వారందరికీ భూమి ఇవ్వాలని చెప్పారు. సామాజిక న్యాయం, సాధికారతపై హైదరాబాద్​లో శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ తనకు మంచి మిత్రుడని, రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ సపోర్ట్ చేసిందని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణకు తాను వ్యతిరేకమని, మాలమాదిగలు కలిసి ఉండాలనేదే తన అభిప్రాయమన్నారు.  వ్యవసాయ చట్టాలను మార్చడానికి కేంద్రం సుముఖంగా ఉందని స్పష్టం చేశారు. ‘‘ఈ నెల 15న జరిగే చర్చల్లో రైతులు ఆందోళన విరమిస్తారని భావిస్తున్నాం. పంజాబ్ ఫార్మర్స్ తప్ప మిగతా రైతులు పెద్దగా వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడం లేదు. రాబోయే ఐదేళ్లలో ఎస్సీల స్కాలర్‌‌షిప్స్​కు కేటాయించిన 59 వేల కోట్లలో కేంద్ర వాటా 60% ఉంది. ఏటా కేంద్ర వాటా 5 % పెరుగుతుంది’’ అని అథావాలే
వివరించారు.

ఎస్సీ వర్గీకరణను అడ్డుకోండి: మాలమహానాడు

ఎస్సీ వర్గీకరణ జరగకుండా అడ్డుకోవాలని  మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య కేంద్రాన్ని కోరారు. శనివారం హైదరాబాద్‌కు వచ్చిన అథావాలేకు వినతిపత్రం అందజేశారు. తొలి నుంచి తమ వాదననే  అథావాలే బలపరున్నారని చెన్నయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగకుండా చూస్తానని, ఉమ్మడి రిజర్వేషన్లను బలపరుస్తానని హామీ ఇచ్చారన్నారు.

For More News..

16 నుంచి వ్యాక్సినేషన్.. జిల్లాకు మూడు సెంటర్లు

సడెన్​గా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

గులాబీ లీడర్ల గొంతులు మూగబోయినయ్​!