కారును ఢీకొట్టిన ఎక్స్​ప్లోజివ్స్​ వ్యాన్.. పదిమందికి గాయాలు

కారును ఢీకొట్టిన ఎక్స్​ప్లోజివ్స్​ వ్యాన్..  పదిమందికి గాయాలు

పెనుబల్లి, వెలుగు :  ఎక్స్​ప్లోజివ్స్​ వ్యాన్​ ఓ కారును వెనక నుంచి ఢీకొట్టడంతో ఆ కారు అదుపుతప్పి  ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టగా పదిమందికి  గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గౌరారం టోల్​ప్లాజా వద్ద ఉన్న శివాలయానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిప్పనపల్లికి చెందిన రామిశెట్టి శ్రీను అతని భార్య శ్రీదేవి, మరో ఇద్దరు బంధువులు డ్రైవర్​తో పాటు వచ్చి కొత్తగా కొన్న  కారుకు పూజ చేయించుకొని వెళ్తున్నారు. అదే టైంలో సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వైపు వెళుతున్న ఎక్స్​ప్లోజివ్స్ వ్యాన్​ ఆ కారును దేవతలగుట్ట వద్ద ఢీకొట్టడంతో అది అదుపుతప్పి భద్రాచలం నుంచి గుంటూరు వైపు వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. 

దీంతో రామిశెట్టి శ్రీను, శ్రీదేవికి తీవ్రగాయాలయ్యాయి. మిగిలినవారు స్వల్పంగా గాయపడ్డారు. గుంటూరు వైపు కారు లో ప్రయాణిస్తున్న సుబ్బారావు, సుశీల, అభిజ్ఞ , అజయ్​లకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ నేషనల్​హైవే అంబులెన్స్​లో పెనుబల్లి ఏరియా దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఖమ్మం హాస్పిటల్​కు తరలించారు. వీఎం బంజర్​ఎస్ఐ​ సూరజ్​ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ​