న్యూఢిల్లీ: మనదేశం నుంచి కార్లు, యుటిలిటీ వెహికల్స్, వ్యాన్లు వంటి ప్యాసింజర్ వెహికల్స్ ఎగుమతులు ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్లో రెండు శాతం పెరిగాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ (సియామ్) విడుదల చేసిన డేటా ప్రకారం, మొత్తం ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) ఎగుమతులు ఈ ఏడాది జులై–-సెప్టెంబర్ కాలంలో 1,60,590 యూనిట్లు కాగా, గత ఏడాది ఇదే కాలంలో 1,57,551 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇదిలా ఉంటే,1.31 లక్షల యూనిట్లకు పైగా డిస్పాచ్లతో మారుతీ సుజుకీ ఇండియా మొదటిస్థానంలో ఉంది. ఇదే క్వార్టర్లో ప్యాసింజర్ కార్ల ఎగుమతులు 5 శాతం తగ్గి 97,300 యూనిట్లకు చేరుకోగా, యుటిలిటీ వెహికల్స్ ఎగుమతులు 16 శాతం పెరిగి 63,016 యూనిట్లకు చేరుకున్నాయి. వ్యాన్ల ఎగుమతులు 274 యూనిట్లకు తగ్గాయి, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 297 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. ఈ విభాగంలోనూ మారుతీ సుజుకి మొదటిస్థానంలో, హ్యుందాయ్ మోటార్ ఇండియా, కియా ఇండియా వరుసగా రెండు మూడవ స్థానాల్లో ఉన్నాయి. మారుతి సుజుకీ 1,31,070 పీవీలను ఎగుమతి చేసింది.
గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 1,03,622 యూనిట్లను పంపింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా విదేశీ డిస్పాచ్లు సంఖ్య 74,072 యూనిట్లుగా ఉంది. ఇది క్రితం సంవత్సరం కాలంలో 66,994 యూనిట్లను అమ్మింది. కియా ఇండియా గ్లోబల్ మార్కెట్లకు 44,564 యూనిట్లను ఎగుమతి చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో 23,213 యూనిట్లను ఎగుమతి చేసింది. నిస్సాన్ మోటార్ ఇండియా 25,813 యూనిట్లను షిప్పింగ్ చేసింది. ఇది సంవత్సరం క్రితం కాలంలో 18,614 యూనిట్లు అమ్మింది. రెనాల్ట్ 18,614 యూనిట్లను ఎగుమతి చేయగా, హోండా కార్స్ ఇండియా 13,326 యూనిట్లను ఎగుమతి చేసింది. ఫోక్స్ వ్యాగన్ ఇండియా 9,641 యూనిట్లను ఎగుమతి చేసింది. కానీ, కమర్షియల్, టూవీలర్స్ సహా మొత్తం ఆటోమొబైల్ ఎగుమతులు 14,10,711 యూనిట్ల నుంచి 12,54,560 యూనిట్లకు తగ్గాయి.