
- అనుమతులు ఇచ్చినరైల్వే శాఖ
- రైళ్ల హాల్టింగ్కు కృషి చేసిన ఎంపీ వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు
- మెరుగైన వసతుల కల్పనకు కృషి : ఎంపీ వంశీ కృష్ణ
కోల్బెల్ట్/పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు మెరుగైన రైల్వే సదుపాయాల కల్పించడంలో భాగంగా జిల్లాలోని వివిధ స్టేషన్లలో ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్కు కృషి చేసినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఈ మేరకు పలు రైళ్లకు హాల్టింగ్ ఇస్తూ రైల్వే శాఖ అనుమతులు ఇచ్చిందని గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో గోరఖ్పూర్, దక్షిణ్, సికింద్రాబాద్ -రక్సౌల్, ఎర్నాకులం- – పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్కు పర్మిషన్ వచ్చిందన్నారు.
రామగుండం రైల్వే స్టేషన్లో సంఘమిత్ర, భాగ్మతి, దక్షిణ, రామేశ్వరం – -బరౌని, ఎర్నాకులం–పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు, పెద్దపల్లి స్టేషన్లో హజ్రత్ నిజాముద్దీన్ – -హైదరాబాద్ దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఆపేందుకు రైల్వే శాఖ ఆఫీసర్లు అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు.
సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వడంతో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు రవాణా సౌకర్యం ఈజీ అవుతుందన్నారు. కాగా, రామగుండం, బెల్లంపల్లి, పెద్దపల్లి రైల్వే స్టేషన్లలో పలు ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్కు కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.