నేపాల్ లో కుప్పకూలిన విమాన ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానం ప్రమాదానికి గురైయ్యే ముందు అందులోని ఓ ప్రయాణికుడు సోనూ జైస్వాల్ ఇచ్చిన పేస్ బుక్ లైవ్ లో ఈ వీడియో రికార్డ్ అయ్యింది.
ప్రమాదంలో చనిపోయిన వారిలో ఐదుగురు భారతీయ ప్రయాణికులు ఉన్న సంగతి తెలిసిందే.. అందులో ఒకరైన సోనూ జైస్వాల్ విమానంలో విండో పక్కన కూర్చుని తన ఫోన్ లో ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాడు. విమానంలో ప్రయాణికులతో పాటు కిటికీ నుంచి అందంగా కనిపించే నగరాన్ని చూపించాడు. ఇంతలో ఆకస్మాత్తుగా పేలుడు జరిగింది. తర్వాత భయంకరమైన మంటలు కనిపించాయి. నేపాల్ కాంగ్రెస్ కు చెందిన నేపాల్ అండ్ సెంట్రల్ కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ అభిషేక్ ప్రతాప్ షా.. ఈ వీడియో ఫుటేజీని ఓ మీడియా సంస్థకు పంపారు. విమానం కూలిన శిథిలాల వద్ద కనబడిన ఫోన్ లోని ఈ ఫుటేజీని తనకొక మిత్రుడు పంపాడని ఆయన తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆదివారం ఖాట్మాండు నుంచి పోఖారా ఎయిర్ పోర్టుకు వస్తున్న యతి ఎయిర్ లైన్స్ చెందిన ఏటీఆర్ 72 విమానం ల్యాండింగ్ కు 5 నిమిషాల ముందు కుప్పకూలింది. ఈ ఘటనలో 72 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు. 68 మంది ప్యాసింజర్లతో పాటు నలుగురు విమాన సిబ్బంది సజీవ దహనమయ్యారు. విమానం కూలిన తర్వాత భారీగా మంటలు చెలరేగడంతో దాదాపు విమానంలోని వారంతా మరణించారు. మృతుల్లో ఐదుగురు భారతీయులు, మరో 10 మంది విదేశీయులు ఉన్నారు.