‘మహా’ ట్విస్ట్: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం

‘మహా’ ట్విస్ట్: సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం

మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు గడిచింది. గత నెల అక్టోబర్ 24న ఫలితాలు వచ్చాయి. రోజు రోజుకో మలుపు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయానికి బీజేపీ అంతిమ గీతం పాడింది. రాత్రికి రాత్రి మహారాజకీయం పూర్తిగా మారిపోయింది. శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అందరూ అనుకున్నారు. కానీ, దానికి భిన్నంగా.. ఎవరూ ఊహంచని విధంగా బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా  రాజ్‌భవన్‌లో గవర్నర్ కోశ్యారీ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఫడ్నవిస్ మహారాష్ట్రకు రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీకి.. ఎన్‌సీపీ మద్ధతు ప్రకటించడంతో బీజేపీకి లైన్ క్లియర్ అయ్యింది. ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దీన్ని బట్టి చూస్తే ఎన్‌సీపీ.. శివసేనకు షాక్ ఇచ్చినట్లుగా అర్ధమవుతుంది. నిన్న సాయంత్రం వరకూ కాంగ్రెస్, శివసేనతో చర్చలు జరిపిన పవార్.. ఉద్ధవ్ థాక్రే సీఎంగా ఉంటారని కూడా ప్రకటించారు. అయితే రాత్రికి రాత్రి ఏం జరిగిందో కానీ.. తెల్లారేసరికి సీన్ మొత్తం పూర్తిగా మారిపోయింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు కావాలి. బీజేపీకి 105 మరియు ఎన్‌సీపీకి 54 సీట్లు ఉన్నాయి. మొత్తం కలిపి 159 సీట్లు అవుతున్నాయి. 

కాగా.. సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రమాణస్వీకారం చేయడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. కొత్త సీఎం, డిప్యూటీ సీఎంలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.