నల్గొండ: బురిడీ బాబా విశ్వ చైతన్య అలియాస్ సాయి విశ్వ చైతన్యతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిఏ పల్లి మండలం అజ్మపూర్ గ్రామంలో 10 ఎకరాల విస్తీర్ణంలో సాయి సర్వస్వము, సాయి మాన్సీ పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నడుపుతున్న బురిడీ బాబాపై నల్గొండ 1 టౌన్ పోలీసులపై ఒక మహిళ పిర్యాదుతో వ్యవహారం బట్టబయలైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కొద్దీ బురిడీ బాబా లీలలు బయటపడుతున్నాయి. రక రకాల మాటలతో మహిలలను లోబరుచుకున్నట్లు గుర్తించారు. 11 మంది పైన మహిళలతో లైంగిక సంబంధం నెరుపుతున్నాడని, తనతో లైంగికంగా కలిస్తే తనలో ఉన్న శక్తులు మొత్తం మీకు వస్తాయని మహిళల్ని నమ్మించడంలో బురిడీబాబా దిట్ట అని పోలీసుల విచారణలో తేలింది. బురిడీబాబా ప్రతిరోజు చాలా మందితో వాట్సాప్ చాటింగ్ చేస్తాడని.. తన ప్రవచనాలను నమ్మితే సొమ్ము.. నమ్మకపోతే దుమ్ము అని చెబుతూ డబ్బులు సంపాదిస్తున్నారని పోలీసులు గుర్తించారు. తన వద్దకు వచ్చే వారికి తాయత్తులు, రక రకాల మూలికలు చూపిస్తూ బురిడీ కొట్టిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఓ మహిల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి.. ఇవన్నీ మీడియాలో.. ప్రచారం జరుగుతుండడంతో బురిడీ బాబా వల్ల నష్టపోయిన చాలా మంది బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గతంలో కూడా ఈ బురిడీ బాబాపై చీటింగ్ కేసులు ఉన్నాయని గుర్తించారు. మాయ మాటలతో మహిళలను ట్రాప్ చేసి వీడియో కాల్స్ చేస్తాడని, ఇటువంటి దొంగ బాబాలను నమ్మొద్దు అని నల్గొండ ఎస్పీ ఏవీ రంగ నాథ్ తెలిపారు. దొంగ బాబాను అరెస్టు చేసిన సందర్భంగా 26 లక్షలు నగదు, 500 గ్రాముల బంగారం తోపాటు వన మూలికలు, పూజా సామగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు. బురిడీ బాబా రెండవ భార్య సుజిత పై కోటి ముప్పై లక్షల రూపాయల ఫిక్సడ్ డిపాజిట్లు ఉన్నాయని గుర్తించామన్నారు. ఇతనికి విదేశాలలో కూడా భక్తులు వున్నారని జిల్లా ఎస్పీ వివరించారు.