ఆదిలాబాద్, వెలుగు : పీడీఎఫ్ ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించి ఫేక్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు తయారు చేస్తున్న ముఠాను గురువారం ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను గురువారం మావల పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.
ఇటీవల ఓ వ్యక్తి సమర్పించిన బర్త్ సర్టిఫికెట్ ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ రికార్డుల్లో లేకపోవడంతో అనుమానం వచ్చిన కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావల సీఐ కె.స్వామి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించగా.. ఫేక్ సర్టిఫికెట్ల తయారీ వ్యవహారం వెలుగుచూసింది.
షేక్ అమీర్, స్టూడెంట్ ఓస రవికుమార్, కిరాణ దుకాణదారుడు అబ్దుల్ ముజాహిద్, కంప్యూటర్ వ్యాపారి అబ్దుల్ తన్వీర్, మీ–సేవ సెంటర్ నిర్వాహకుడు అడపా సంతోష్తో పాటు జునైద్ అనే వ్యక్తి కలిసి పీడీఎఫ్ ఎడిటింగ్ టూల్స్ను ఉపయోగించి బర్త్ సర్టిఫికెట్లు, ఓటర్ ఐడీ కార్డులు, ఆధార్ కార్డుల్లో మార్పులు చేస్తున్నట్లు గుర్తించారు.
ప్రభుత్వ పథకాలకు అర్హత పొందేలా సర్టిఫికెట్లు తయారు చేసి ఇస్తామని చెబుతూ.. ఒక్కో పత్రానికి రూ.1500 నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. గురువారం ఐదుగురిని అదుపులోకి తీసుకోగా.. జునైద్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని ఎస్పీ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 280కి పైగా డిజిటల్ పత్రాలు ఉన్న మొబైల్స్, నకిలీ ఓటర్ కార్డులు, నకిలీ బర్త్ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, మావల ఎస్హెచ్వో రాహుల్ కాంత్, సీఐ కర్ర స్వామి పాల్గొన్నారు.
