- మహిళను నమ్మించి లాడ్జికి రప్పించిన ఫేక్ డాక్టర్
- మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి 10 గ్రాముల గోల్డ్, రూ.25 వేలు చోరీ
- గోపాలపురం పీఎస్ పరిధిలో ఘటన
సికింద్రాబాద్, వెలుగు: రోగం నయం చేస్తానని నమ్మించిన ఓ ఫేక్ డాక్టర్ మహిళకు మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చి బంగారు గొలుసు, డబ్బు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన గోపాలపురం పీఎస్ పరిధిలో జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఈస్ట్గోదావరి జిల్లాకు చెందిన నూకల సుజాత(50) బతుకుదెరువు కోసం చాలాకాలం కిందట సిటీకి వచ్చి కేపీహెచ్బీ పరిధి ఎల్లమ్మబండలో ఉంటోంది. స్థానిక బీజేఆర్ కాలనీలో టీ షాప్ నడుపుతోంది. కాకినాడ జిల్లా పిఠాపురంలో బంధువుల పెండ్లి ఉండటంతో ఈ నెల 2న ఆమె సికింద్రాబాద్ స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కింది. అదే రైలులో ఆమె పక్కన కూర్చున్న ఓ వ్యక్తి సుజాతతో మాటలు కలిపాడు.
తాను పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో సర్జన్గా పనిచేస్తున్నానని పరిచయం చేసుకున్నాడు. దీంతో సుజాత తనకున్న అనారోగ్య సమస్యలను అతడితో చెప్పింది. తాను చెప్పిన ప్లేస్కు వస్తే నిమిషాల్లో రోగం నయంజేస్తానని నమ్మించి సదరు వ్యక్తి ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. బంధువుల పెండ్లి చూసుకుని ఈ నెల 6న రాత్రి సుజాత పిఠాపురం నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు ఆమె రైలులో ఉండగానే ఫేక్డాక్టర్ ఫోన్ చేశాడు. 8.30 గంటలకు రైలు దిగగానే స్టేషన్కు వచ్చి కలిశాడు. దగ్గరలో ఉన్న లాడ్జిలో రూమ్ తీసుకున్నానని.. అక్కడికి వస్తే మందులు ఇస్తానని చెప్పాడు. రెజిమెంటల్బజార్ గురుద్వారా వెనుక ఉన్న ఓ లాడ్జిలోని రూమ్కు సుజాతను తీసుకెళ్లాడు.
కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చి వేసుకోవాలని చెప్పాడు. సుజాత ఆ ట్యాబ్లెట్లు మింగిన కొద్దిసేపటికే స్పృహ కోల్పోయింది. వెంటనే సదరు వ్యక్తి ఆమె బ్యాగ్ను చెక్ చేసి అందులో ఉన్న రూ.25 వేల క్యాష్, ఆమె ఒంటిపై ఉన్న 10 గ్రాముల గోల్డ్ చైన్, సెల్ఫోన్ తీసుకుని పారిపోయాడు. మధ్యాహ్నం 12.30గంటలకు సుజాతకు మెలకువ రాగా.. రూమ్లో ఎవరూ కనిపించలేదు. బ్యాగ్లోని డబ్బు, బంగారు గొలుసు, సెల్ఫోన్ మాయమైనట్లు గుర్తించింది. వెంటనే ఫేక్డాక్టర్పై గోపాలపురం పీఎస్లో కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకటేశ్వర్లు అనే పేరుతో ఉన్న ఆధార్ కార్డును చూపించి నిందితుడు లాడ్జిలో రూమ్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫేక్ డాక్టర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.