
- ..రూ.1.77 లక్షల షాపింగ్.. ఆ తర్వాత బిచాణా ఎత్తేసిన ఇద్దరు మహిళలు
- ఎట్టకేలకు నిందితులు అరెస్ట్
పద్మారావునగర్, వెలుగు: ఒంటరిగా ఉంటున్న వృద్ధులను టార్గెట్చేసుకొని, పెండ్లి సంబంధాల పేరుతో మోసం చేస్తున్న ఇద్దరు మహిళలను మహంకాళి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని కృష్టాజిల్లా తిరువూరుకు చెందిన కటారు తాయారమ్మ అలియాస్సరస్వతీ(65), ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన కూనపరెడ్డి స్వాతి (40) కలిసి ఓ దినపత్రికలో మ్యారేజ్ బ్యూరో పేరుతో వృద్ధుల కోసమే ప్రత్యేకంగా తప్పుడు ప్రకటనలు ఇచ్చేవారు.
వాటిని చూసి ఖమ్మం జిల్లా మధిర ప్రాంతానికి ఓ వృద్ధుడు గతేడాది అక్టోబర్లో వీరిని కాంటాక్ట్ అయ్యాడు. తనకు పెండ్లి చేసుకోవాలని ఉందని, అమ్మాయిని చూపించాలని కోరాడు. దీంతో ఒక విడో అమ్మాయి ఉందని చెప్పి, దిల్సుఖ్నగర్లోని గణేశ్ లాడ్జిలో పెండ్లి చూపులు ఆరెంజ్ చేశారు. వృద్ధుడికి అమ్మాయి నచ్చడంతో పెండ్లి షాపింగ్కోసం సికింద్రాబాద్లోని ఆర్పీ రోడ్డుకు తీసుకెళ్లి, రూ.1.77 లక్షల షాపింగ్చేశారు.
ఆ డబ్బులను బాధిత వృద్ధుడితోనే కట్టించారు. ఆ తర్వాత త్వరలో పెండ్లి పెట్టుకుందామని చెప్పి, పత్తా లేకుండా పోయారు. ఫోన్ నంబర్లు కూడా స్విచ్చాఫ్ రావడంతో మహంకాళి పోలీసులకు బాధితుడు అదే నెలలో ఫిర్యాదు చేశాడు. అయితే, నిందితుల ఫొటోలు లేకపోవడం, పత్రికలో మ్యారేజ్ బ్యూరో నంబర్లు కూడా ఫేక్కావడంతో వారిని ట్రేస్ చేయడం కష్టంగా మారిందని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు నిందితులను సోమవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.