రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ఫేక్ న్యూస్  స్టార్టయింది

రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ఫేక్ న్యూస్  స్టార్టయింది

‘సాలు దొర, సెలవు దొర’ ప్రచారానికి ఈసీని బీజేపీ కోరినట్లు తప్పుడు ప్రచారం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ఫేక్ న్యూస్  స్టార్టయింది. త్వరలో మునుగోడు బైపోల్​ జరగనున్న నేపథ్యంలో ఈ తరహా ప్రచారాన్ని  స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. జరగనిది జరిగినట్లు, జరిగింది జరగనట్లు ఫేక్​ న్యూస్​ క్రియేట్​ చేసి జనాల్లోకి వదులుతున్నారు. తాజాగా ‘సాలు దొర, సెలవు దొర’ అనే క్యాంపెయిన్​కు ఈసీని బీజేపీ రాష్ట్ర శాఖ అనుమతి కోరినట్లు సోషల్ మీడియాలో కొందరు ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ సీఈవో  ప్రెస్​మీట్ పెట్టి  ఖండించారు. తమకు ఎలాంటి లేఖ రాలేదని స్పష్టం చేశారు. బీజేపీకి ఈసీ షాక్ అని గురువారం ఉదయం నుంచి కొందరు టీఆర్​ఎస్​ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. 

గతంలోనూ ఇదే తంతు

గతంలో జీహెచ్​ఎంసీ, గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికలు, హుజూరాబాద్ ​ టైంలో  ఫేక్​ సర్వేలను వైరల్​ చేసి ఓటర్లను గందరగోళానికి గురిచేశారు.  జీహెచ్ ఎంసీ లో వరదలు వచ్చినప్పుడు వరద సాయం రూ.10 వేలు ఆపాలని బీజేపీ స్టేట్​ చీఫ్​ సంజయ్ ఈసీకి లేఖ రాసినట్లుగా కొందరు టీఆర్​ఎస్​ నేతలు ఫేక్  లెటర్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. హుజూరాబాద్​లో ఈటల రాజేందర్​కు, బీజేపీకి వ్యతిరేకంగా ఫేక్​ న్యూస్​ క్లిప్పింగులు పెట్టి వాట్సాప్​, ఫేస్​బుక్​లో వైరల్​ చేశారు. వీటిపై సైబర్​ క్రైమ్​ ఏసీపీ కేవీ ఎం ప్రసాద్​కు ఫిర్యాదులు  చేశారు. వాట్సాప్​ పోస్టింగ్స్​, యూఆర్​ఎల్​ లింక్స్​ను కూడా ఆయనకు అందజేశారు. సంజయ్​ పేరుతో మార్ఫింగ్​ అయిన బ్రేకింగ్  న్యూస్​పైనా  ఫిర్యాదు ఇచ్చారు. నిందితులపై యాక్షన్​ తీసుకుంటామని అప్పుడే  ఏసీపీ హామీ ఇచ్చినా.. ఇప్పటికీ ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు.