- వార్తలన్నీ పుకార్లు అన్న కజకిస్థాన్
నూర్సులాన్: చైనా సరిహద్దు దేశం కజికిస్థాన్లో గుర్తు తెలియని వైరస్ విజృంభిస్తోందని చైనా ఎంబసీ చేసిన ఆరోపణలను కజకిస్థాన్ కొట్టిపారేసింది. చైనా ఎంబసీ చేస్తున్న ఆరోపణలు వట్టి పుకార్లే అని చెప్పింది. కజకిస్థాన్లో సరికొత్త రకమైన న్యూమోనియా ప్రబలుతోందని కొన్ని చైనా మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్న సమచారం సరైంది కాదు అని ప్రకటన రిలీజ్ చేసింది. బ్యాక్టీరియా, ఫంగల్, వైరల్ న్యూమోనియా కేసులు నమోదవుతున్నాయని తాము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. కజకిస్థాన్లోని తమ పౌరులు గుర్తుతెలియని న్యుమోనియాతో బాధపడుతున్నారని, జూన్లోనే దాదాపు 600 మందికి పైగా చనిపోయారనే వార్త ప్రకంపనలు సృష్టిస్తోందని చైనా ఎంబసీ చెప్పింది. ఆరు నెలల్లో దీని వల్ల 1772 మంది చనిపోయారని వాళ్లలో చైనీలు కూడా ఉన్నారని డ్రాగన్ ఎంబసీ పేర్కొంది. కరోనా కంటే న్యూమోనియా బారిన పడిన మృతి చెందిన వారి సంఖ్య రెండు నుంచి మూడురెట్లు ఎక్కువగా ఉందని, ఆ విషయంపై కజకిస్థాన్ హెల్త్ కేర్ మినిస్టర్ బుధవారం ప్రకటన చేశారని చైనా మీడియాలో ప్రసారం అయింది.
