ఖమ్మం జిల్లా: వాహనదారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీసును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఖమ్మం జిల్లా, మోరంపల్లి బంజారా మండలం అంజనాపురానికి చెందిన గూగులోతు అకిల్ నాయక్ (20 ) అనే యువకుడు జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో ఫేక్ పోలీసు అవతారం ఎత్తాడు. కొన్ని రోజులుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా, రైల్వే ఉద్యోగిగా అకిల్ నాయక్ అక్రమాలకు పాల్పడుతున్నాడు.
ఇటీవల సంధ్యాతండా వద్ద ఇసుక ట్రాక్టర్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం కూసుమంచి మండలం శివాలయం క్రాస్రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అకీల్ నాయక్ ను అదుపులోకి తీసుకొని విచారించారు. నేరాలు అంగీకరించడంతో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు పోలీసులు.