
- బతుకమ్మ పండుగకు పంపిణీకి రాష్ట్ర సర్కార్ చర్యలు
- ఒక్కో మహిళలకు
- రెండు చీరలు అందజేత
- వచ్చే నెల15 లోపు తయారీ పూర్తి
- రెండు షిఫ్ట్ ల్లో పని చేస్తున్న కార్మికులు
- ఇప్పటికే సుమారు 36 లక్షల చీరలు రెడీ
రాజన్నసిరిసిల్ల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మహిళా పొదుపు సంఘాలకు అందించే ‘ఇందిరమ్మ’ చీరల ఉత్పత్తి స్పీడందుకుంది. సంఘాల మహిళలకు ఒక్కోక్కరికి రెండు చీరలు ఫ్రీగా ఇవ్వనుంది. ఇందుకు సిరిసిల్ల నేతన్నలకు సర్కార్ ఆర్డర్ ఇచ్చింది. 65 లక్షల చీరల తయారీకి ఆదేశించింది. రెండు విడతల్లో 9 కోట్ల మీటర్ల వస్త్రం అందించింది.
రూ.318 కోట్లు కేటాయింపు
సిరిసిల్ల టౌన్ లో అధికంగా నేత కార్మికులు ఉన్నారు. వీరికి ఏడాదిపాటు ఉపాధి కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. గత ఫిబ్రవరిలో ‘ఇందిరా మహిళా శక్తి’ స్కీమ్ లో భాగంగా చీరలు తయారు చేసేందుకు నేతన్నలకు ఆర్డర్ ఇచ్చింది. రూ.318 కోట్లు కేటాయించింది. వెంటనే కార్మికులకు కూలీ ఖరారు చేయకపోవడంతో కొంత జాప్యం జరిగింది. మార్చిలో కూలీ ఖరారు చేయడంతో ఏప్రిల్ నుంచి ఇందిరమ్మ చీరలు ఉత్పత్తిలో వేగం పెరిగింది. 6 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతుండగా.. ఒక్కొక్కరు దాదాపు 20 వేల వరకు సంపాదిస్తున్నారు.
30 లక్షల చీరలు రెడీ
ఇప్పటికే దాదాపు 30 లక్షల చీరలు రెడీ అయ్యాయి. రోజూ సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ గోడౌన్ లో చీరల క్లాత్ ప్రభుత్వం ప్రొక్యూర్ చేస్తుంది. వస్త్రాన్ని కొనుగోలు చేసి ప్రాసెసింగ్ కు అధికారులు హైదరాబాద్ పంపిస్తున్నారు. మరో 30 లక్షల చీరలను ఉత్పత్తి చేసేందుకు కార్మికులు మూడు షిప్టుల్లో పని చేస్తున్నారు. చీరల ఉత్పత్తిని చేనేత జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యార్ పర్యవేక్షిస్తున్నారు.
చీరలు నాణ్యతతో రూపొందుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరలను నాసిరకం పాలిస్టర్ క్లాత్ తయారు చేయడంతో మహిళలను నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈసారి అలాకాకుండా నాణ్యతతో కూడిన చీరలను ప్రభుత్వం ఉత్పత్తి చేయిస్తోంది. ఒక్కో చీర దాదాపు రూ.800 వరకు ధర పలుకుతుందని టెస్కో ఆఫీసర్లు చెప్తున్నారు.
చీరల ఉత్పత్తిలో వేగం పెంచాం..
ఇందిరమ్మ చీరల ఉత్పత్తిలో వేగం పెంచాం. కార్మికులు మొదట్లో ఒక షిఫ్టుల్లో పనిచేయగా.. ప్రస్తుతం రెండు షిఫ్టుల్లో చేస్తున్నారు. కొన్నిచోట్ల మూడు షిఫ్టులు కూడా చేయిస్తున్నాం. ఇప్పటికే 2.30 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి అయింది. - రాఘవరావు,చేనేత ఏడీ, రాజన్న సిరిసిల్ల జిల్లా