- తాండూరులో దొంగ నోట్ల ప్రింటింగ్, 8 మంది అరెస్ట్
మెహిదీపట్నం/వికారాబాద్, వెలుగు: సౌత్ వెస్ట్ జోన్, మెహిదీపట్నం పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నకిలీ రూ.500 నోట్లు చెలామణి చేస్తున్న 8 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.4.75 లక్షల ఫేక్ కరెన్సీతో పాటు కారు, మూడు బైక్లు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సౌత్ వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ బి.శ్రీకృష్ణగౌడ్ మెహిదీపట్నం పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు.
కోస్గి మండలం గుండిమల్ గ్రామానికి చెందిన కస్తూరి రమేశ్ తన సోదరి రామేశ్వరితో కలిసి తాండూరులోని తన నివాసంలో నకిలీ రూ.500 రూపాయల నోట్లను తయారు చేశారు. ఒక ఒరిజినల్ నోటుకు 4 ఫేక్ నోట్ల చొప్పున బయటి వ్యక్తులకు విక్రయిస్తున్నారు. హైదరాబాద్ సులేమాన్ నగర్ కు చెందిన అబ్దుల్ వహీద్(21), మొహమ్మద్(21) ఇన్స్టాగ్రాంలో కస్తూరి రమేశ్ను సంప్రదించి ఫేక్ నోట్లు తీసుకున్నాడు.
వీరిద్దరు ఒక ఒరిజినల్ నోటుకు మూడు ఫేక్ నోట్ల చొప్పున సులేమాన్ నగర్ కు చెందిన మొహమ్మద్ సోహైల్ (21), బహాదూర్ పురా ప్రాంతానికి చెందిన మొహమ్మద్ ఫహాద్(23)కు విక్రయించారు. సోహైల్ ఫహాద్ ఒక ఒరిజినల్ నోటుకు రెండు ఫేక్ నోట్ల చొప్పున షేక్ ఇమ్రాన్(23), కూకట్పల్లికి చెందిన ఒమర్ ఖాన్లకు ఇచ్చారు.
ఇమ్రాన్, ఒమర్ ఫస్ట్ లాన్సర్స్ లోని ఈద్గా దర్గా వద్ద సయ్యద్ కిషన్ బాగ్ కు చెందిన అల్తమాష్(21)తో నకిలీ నోట్లు మార్పిడి చేసుకోవడానికి మంగళవారం రాత్రి ప్రయత్నిస్తుండగా టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారిని గురువారం రిమాండ్ కు తరలించారు. రమేశ్బాబు, రామేశ్వరిని ఇంతకుముందు కూడా దొంగ నోట్ల విషయంలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తయారీ ఇలా..
ఫేక్ నోట్లు ఎలా తయారు చేశారో పోలీసులు వివరించారు. ప్రధాన నిందితుడు రమేశ్ ముందుగా ఒరిజినల్ 500 నోటును స్కాన్ చేశాడు. ఫొటోషాప్ ఉపయోగించి జేకే బాండ్ పేపర్పై ప్రింట్ తీసి, ఆ నోట్లను అసలు నోటు సైజులో కట్ చేశాడు. గిఫ్ట్ ప్యాక్ పేపర్ సాయంతో గ్రీన్ సెక్యూరిటీ థ్రెడ్ను సిద్ధం చేసి సరిపోయేంత పరిమాణానికి కత్తిరించి, ఫెవికోల్ తో నకిలీ కరెన్సీకి స్ట్రిప్ను అతికించాడు. హీట్ గన్ ఉపయోగించి నోట్లను ఆరబెట్టి ఫేక్ కరెన్సీని తయారుచేశాడు.
