'బింబిసార' మూవీ ఫంక్షన్ లో అభిమానికి ఫిట్స్, మృతి

'బింబిసార' మూవీ ఫంక్షన్ లో అభిమానికి ఫిట్స్, మృతి

'బింబిసార' ఆడియో రిలీజ్ ఈవెంట్ లో ఓ అభిమాని మృతి చెందాడు. నిన్న మాదాపూర్ శిల్పకళా వేదికలో జరిగిన కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార ఆడియో రిలీస్ ఈవెంట్ ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఫంక్షన్ లో పుట్టా సాయి రామ్ అనే అభిమానికి ఫిట్స్ రావడంతో చికిత్స నిమిత్తం కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ అభిమాని మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇక ఫంక్షన్ లో మృతి చెందిన పుట్టా సాయిరామ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లి గూడెంకు చెందినట్టుగా  తెలుస్తోంది. అతను కూకట్ పల్లిలో వుంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్టు సమాచారం.

ఈ విషయంపై బింబిసార మూవీ యూనిట్ స్పందించింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో తాము తీవ్రంగా చింతిస్తున్నామని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన పుట్టా సాయిరామ్ కు మూవీ యూనిట్ తరపున నివాళులు తెలియజేశారు.

ఇదిలా ఉండగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార' ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను అత్యంత గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్ కు ఛీఫ్ గెస్ట్ గా జూ. ఎన్టీఆర్ హాజరయ్యారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ పీరియాడిక్, సైన్స్ ఫిక్షన్ మూవీకి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో క్యాథరిన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఆగష్టు 5 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.