- సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం
- వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో విషాదం
నెక్కొండ, వెలుగు : కొనుగోలు కేంద్రంలోని తన వడ్ల కుప్ప వద్దే ఓ రైతు గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటన వరంగల్జిల్లా నెక్కొండ మండలంలోని అలంకానిపేటలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాజుల పెద్ద వెంకటేశ్వర్లు (61) పదిహేను రోజుల కింద 100 క్వింటాళ్ల మక్కలను సంగెం మండలంలోని కాపులకానిపర్తి కొనుగోలు కేంద్రానికి, పది రోజుల కింద 60 క్వింటాళ్ల వడ్లను అలంకానిపేటలోని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాడు. అటు మక్కలు, ఇటు వడ్ల కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం అలంకానిపేటలోని వడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చిన వెంకటేశ్వర్లు.. తోటి రైతులతో మాట్లాడుతూనే కూప్పకూలిపోయాడు. గమనించిన రైతులు వెంటనే సీపీఆర్ చేసినా.. ఫలితం లేకపోవడంతో రైతు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య నాగలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైతు మృతి విషయం తెలుసుకున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వెంకటేశ్వర్లు చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఫ్యామిలీకి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.
