
- నిజామాబాద్ జిల్లా రైతును మోసగించిన సైబర్ నేరగాళ్లు
ఎడపల్లి, వెలుగు : రైతు ఫోన్ కు వాట్సప్ లింక్పంపి బ్యాంకు అకౌంట్ లోంచి సైబర్ నేరగాళ్లు రూ. లక్షల్లో డబ్బులు కొట్టేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఎడపల్లి ఎస్ఐ వంశీ కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు ఇందూరి శేఖర్ సెల్ఫోన్ కు రెండు రోజుల కింద ఓ మెసేజ్ వచ్చింది. అందులో.. పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ. 30 వేలు పంపించామని, వాటిని పొందాలంటే కింది లింక్ను క్లిక్చేయాలని ఉంది. దీంతో శేఖర్ఆ లింక్పై క్లిక్ చేయగా రూ. 30 వేలు తన ఖాతాలో జమ అయినట్టు మెసేజ్ వచ్చింది. అనంతరం అతని అకౌంట్ నుంచి విడతల వారీగా సైబర్నేరగాళ్లు జమ చేసిన డబ్బుతో పాటు మరో రూ. 2 లక్షలు కొట్టేశారు.
రెండు రోజుల తర్వాత అతను తన బ్యాంక్ అకౌంట్ లోని డబ్బులు చెక్ చేసుకోగా ఖాళీగా ఉంది. ఆందోళనకు గురైన అతను సైబర్నేరగాళ్లు మోసం చేశారని గుర్తించి ఎడపల్లి పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సైబర్ క్రైం పోలీసులకు వివరించగా జార్ఖండ్ కు చెందిన వ్యక్తులు సైబర్ నేరానికి పాల్పడినట్టు తేలింది. గుర్తు తెలియని వ్యక్తుల నంబర్ల నుంచి ఎలాంటి లింక్లు వచ్చినా వాటిని ఓపెన్ చేయొద్దని, ఓటీపీలు చెప్పొద్దని ప్రజలకు
ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి సూచించారు.