పీఎం కిసాన్ స్కీమ్ పేరిట లింక్ పంపించి.. రూ. 2 లక్షలు కొట్టేశారు!

పీఎం కిసాన్ స్కీమ్ పేరిట లింక్ పంపించి.. రూ. 2 లక్షలు కొట్టేశారు!
  • నిజామాబాద్ జిల్లా రైతును మోసగించిన సైబర్ నేరగాళ్లు

ఎడపల్లి,  వెలుగు :  రైతు ఫోన్ కు వాట్సప్ లింక్​పంపి బ్యాంకు అకౌంట్ లోంచి సైబర్ నేరగాళ్లు రూ. లక్షల్లో డబ్బులు కొట్టేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఎడపల్లి ఎస్ఐ​ వంశీ కృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు ఇందూరి శేఖర్​ సెల్​ఫోన్​ కు రెండు రోజుల కింద ఓ మెసేజ్ వచ్చింది. అందులో.. పీఎం కిసాన్​ స్కీమ్ కింద  రూ. 30 వేలు పంపించామని, వాటిని పొందాలంటే కింది లింక్​ను క్లిక్​చేయాలని ఉంది. దీంతో  శేఖర్​ఆ లింక్​పై క్లిక్​ చేయగా రూ. 30 వేలు తన ఖాతాలో జమ అయినట్టు మెసేజ్ వచ్చింది. అనంతరం అతని అకౌంట్ నుంచి  విడతల వారీగా సైబర్​నేరగాళ్లు జమ చేసిన డబ్బుతో పాటు మరో రూ. 2 లక్షలు కొట్టేశారు. 

రెండు రోజుల తర్వాత అతను తన బ్యాంక్​ అకౌంట్ లోని డబ్బులు చెక్​ చేసుకోగా ఖాళీగా ఉంది. ఆందోళనకు గురైన అతను సైబర్​నేరగాళ్లు మోసం చేశారని గుర్తించి ఎడపల్లి పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సైబర్​ క్రైం పోలీసులకు వివరించగా జార్ఖండ్ కు చెందిన వ్యక్తులు సైబర్​ నేరానికి పాల్పడినట్టు తేలింది.  గుర్తు తెలియని వ్యక్తుల నంబర్ల నుంచి ఎలాంటి లింక్​లు వచ్చినా వాటిని ఓపెన్​ చేయొద్దని, ఓటీపీలు చెప్పొద్దని ప్రజలకు 
ఎస్ఐ  వంశీకృష్ణారెడ్డి సూచించారు.