జగిత్యాల: జగిత్యాలలో మాజీ మేయర్, కరీంనగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఆయన కోరారు. ఆత్మ గౌరవానికి, ధన బలానికి మధ్య ఈ పోటీ జరుగుతోందని ఆయన అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. కరీంనగర్ ఉద్యమాల ఖిల్లా అని.. ఇక్కడి నుంచే టీఆర్ఎస్ పతనం ప్రారంభం కావాలని అన్నారు.
‘ఎన్నికల్లో నేను విత్ డ్రా చేసుకుంటే భాను ప్రసాద్ రావు ఏకగ్రీవం అయ్యేవాడు. గతంలో 12 ఏళ్లు ఎమ్మెల్సీగా ఉన్న భానుప్రసాద్ ఏనాడు స్థానిక సంస్థల సమస్యలు పట్టించుకోలేదు. ఆయన ఎప్పుడైనా కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను కలిశారా? కనీసం కరోన సమయంలో కూడా ఎవరికి అందుబాటులో లేడు. కేవలం ఆయన వ్యాపారాల కోసమే భాను ప్రసాద్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు. ప్రజాప్రతినిధులు చైతన్య వంతులు.. నాకు ఓటేస్తే అందరికి అందుబాటులో ఉంటా. హుజురాబాద్ లో డబ్బులు పంచినప్పటికీ.. ప్రజలు న్యాయం వైపే ఓటేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ అహంకారంతో ఎంపీటీసీలపై చేసిన వాఖ్యలను ఖండిస్తున్నాను. ఎంపీటీసీలు కూర్చునేందుకు కనీసం గ్రామపంచాయతీల్లో కుర్చీ కూడా లేదు. నేను పోటీలో ఉండటం వల్లే ప్రజాప్రతినిధుల ఆత్మ గౌరవం పెరిగింది. టీఆర్ఎస్ నాయకులు ఏకగ్రీవం అయితే కనీసం ఓటు కోసం కూడా వాళ్లు మీ దగ్గరకు రాకపోయేవారు. ఇప్పుడు పోటీ ఉండటం వల్లే వాళ్లు మీకు సలాం కొడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు ఎక్కడ న్యాయం జరగడం లేదు.. అందుకే పోటీలో ఉన్నాను. కొందరు ఎంపీటీసీలకు తిందామంటే తిండి కూడా లేదు. గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ఎంపీటీసీలను భాగస్వాములను చేయాలని పోరాడుతా. స్థానిక సంస్థల సమస్యలపై పోరాడుతా.. నాకు ఓటెయ్యండి. పన్నెండేళ్ళుగా కుర్చీలో కూర్చొని ఏం చేశావు భాను ప్రసాద్ రావు..? కనీసం నిన్ను ప్రపోజ్ చేసిన వారి పేర్లైనా నీకు తెలుసా?’ అని రవీందర్ సింగ్ అన్నారు.
For More News..