ఫారెస్ట్ ఆఫీసర్ల దౌర్జన్యం

ఫారెస్ట్ ఆఫీసర్ల దౌర్జన్యం
  • పోడు రైతును కొట్టి  చీకటి గదిలో బంధించారు
  • నర్సంపేట అటవీ ఆఫీసర్ల నిర్వాకం

నర్సంపేట, వెలుగు : ఫారెస్టు అధికారులు పోడు రైతును విపరీతంగా కొట్టి,  చీకటి గదిలో  12 గంటల పాటు బంధించిన ఘటన నర్సంపేట పట్టణంలోని ఫారెస్టు రేంజ్ ​ఆఫీసులో జరిగింది. బాధితుడు  తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్​ జిల్లా గుండెంగ గ్రామానికి చెందిన అంగిడి సమ్మయ్య నెక్కొండ మండలం నాగారంలోని అటవీ భూమిని 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. ఇటీవల ఫారెస్ట్​ సిబ్బంది హరితాహారం కార్యక్రమంలో భాగంగా సమ్మయ్య భూమిలో  మొక్కలు నాటేందుకు  ప్రయత్నించగా.. అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహంతో అటవీ అధికారులు సమ్మయ్యను కొట్టుకుంటూ నర్సంపేట అటవీకార్యాలయానికి తీసుకెళ్లారు. ఉదయం 8 గంటలకు ఆఫీసులోని ఓ గదిలో బంధించిన అధికారులు, కాళ్లు మొక్కినా కనికరించకుండా కొట్టారనీ, సర్పంచ్​ వచ్చినా తమ దగ్గర లేడని చెప్పారని వాపోయాడు.  అనంతరం మీడియా చొరవతో తనను రాత్రి 8 గంటల సమయంలో వదిలివేశారంటూ సమ్మయ్య  కన్నీరుమున్నీరయ్యాడు.