కొంప ముంచిన ఈము కోడి

కొంప ముంచిన ఈము కోడి
  • పెంపకంతో అప్పులపాలైన రైతులు
  • రుణమాఫీతో గట్టెక్కించాలని వేడుకోలు
  • ఏపీలో ఈము రైతును ఆదుకున్న ప్రభుత్వం

లక్షలు, కోట్లలో లాభాలంటూ ఆశపెట్టిన ఈము కోళ్ల పెంపకం ఎంతో మంది రైతులను నట్టేట ముంచింది. పెట్టుబడి భారంతో చిన్న రైతులు లక్షల్లో నష్టపోయారు. దీంతో రోడ్డున పడ్డ వారి బతుకులు నేటికీ బాగుపడలేదు. అడ్డికి పావుశేరు లెక్కన నష్టాలకు అమ్ముకొని పెంపకం భారం వదిలించుకున్నా… అప్పులు, బ్యాంకు లోన్లు వారిని వెంటాడుతూనే ఉన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 118 మంది ఈము రైతులు బ్యాంకులకు రూ.27.03 కోట్లు బాకీ పడ్డారు. వడ్డీలతో కలిసి నేడవి రూ.32 కోట్లకు చేరుకున్నాయి. దీంతో రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈము రైతులను గట్టెక్కించింది.

ఈము బర్డ్స్‌‌ పెంపకం కోసం 2009–10లో  అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 480 మంది రైతులను ఎంపిక చేయగా వారిలో 118 తెలంగాణ ఔత్సాహికులు, రైతులు ఉన్నారు. వీరు తమ ఆస్తులను కుదువపెట్టి మరీ 13 బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చారు. నాబార్డు ఆధ్వర్యంలో శిక్షణ కల్పించి, ఒక్కొక్కరికీ 50 బర్డ్స్‌‌ అందించారు. ఒక్కో ఫామ్‌‌ను రూ.30 లక్షలతో ఏర్పాటు చేశారు. ఇందులో 50శాతం బ్యాంకు లోన్‌‌, 25 శాతం నాబార్డు సబ్సిడీ, 25 శాతం లబ్ధిదారుడి వాటాగా వీటిని ఏర్పాటు చేశారు. బర్డ్స్‌‌ పెరిగిన తరువాత మార్కెటింగ్‌‌ విషయంలో చేతులెత్తేయడంతో ఈ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. తీసుకున్న అప్పులు తిరిగి కట్టాలని బ్యాంకులు ఒత్తిడి తేవడంతో రైతులు ఆస్తులు  అమ్ముకొని కట్టారు. ఈ  నేపథ్యంలో తెలంగాణ పశుసంవర్థకశాఖ ఓ కమిటీ వేసింది. ఈము రైతులను ఆదుకోవాలని సిఫారసు చేస్లూ 2017లో కమిటీ ప్రభుత్వానికి రిపోర్ట్‌‌ ఇచ్చింది. ఏపీలో ప్రభుత్వం నష్టపోయిన రైతుల లోన్లు మాఫీ చేసి వారిని గట్టెక్కించిందని అందులో పేర్కొంది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం రిపోర్ట్‌‌ను ఆర్థికశాఖకు పంపింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తిరిగి పశుసంవర్థకశాఖకు పంపించింది.  ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రజాప్రతినిధులు ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు.

ఆశలు అడియాశలు

అధిక లాభాల ఆశతో ఈము బర్డ్స్‌‌ పెంపకం చేపట్టిన యువకులు, రైతుల కలలు ఎంతో కాలం నిలువలేదు. నెలలు తిరుగక ముందు రంగుల కల చెదిరిపోయింది. కోళ్లు, గుడ్లు, పిల్లలు కొనేవాళ్లు లేక, మరో వైపు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించ లేక ఇబ్బందులు పడ్డారు. వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఈము బర్డ్‌‌ ఆస్ట్రేలియా నుంచి దిగుమతైంది. ఒక్కరిద్దరితో ప్రారంభమైన పెంపకం వందలకు చేరింది. ప్రాసెసింగ్‌‌ ప్లాంట్లు వస్తున్నాయన్న ప్రచారంతో చాలా మంది కొత్త రైతులు ఈ రంగంలోకి వచ్చి మాంసం, కొవ్వు కోసం విక్రయించేందుకే ఈము కోళ్లను పెంచడం మొదలుపెట్టారు. ప్రాసెసింగ్‌‌ ప్లాంట్లు వస్తాయన్న ధీమాతో రైతులు సొంత మార్కెటింగ్‌‌పై దృష్టి పెట్టలేదు. ప్రభుత్వం కూడా రుణాలు, రాయితీలకే పరిమితమైంది తప్ప పరిశ్రమ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఫలితంగా ఈము

ప్రభుత్వం స్పందించాలి

ప్రభుత్వం స్పందించి బ్యాంకుల ఒత్తిడి లేకుండా చేసి ఈము రైతుల లోన్లు మాఫీ చేసి ఆదుకోవాలి. పశుసంవర్థకశాఖ స్పష్టమైన ప్రకటన ఇచ్చినా.. బ్యాంకులు ఒత్తిడి చేయకుండా ఉంటే పరోక్షంగా ఆదుకున్నట్లే, ప్రభుత్వం చేసి ఈము రైతులను ఆదుకునేలా జీవో విడుదల చేయాలి.

–శ్రీనివాస్‌‌, కన్వీనర్‌‌, ఈము రైతుల సంఘం