
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణను వేగవంతం చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా కోల్ ఇండియా , లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా , రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్యూలు) వాటాలను విక్రయించే అవకాశం ఉంది. ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానం ద్వారా వాటాలను అమ్మడానికి ఏర్పాట్లు చేస్తోంది.
ఆర్వీఎన్ఎల్లో వాటాల అమ్మకం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి క్వార్టర్ తర్వాత ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణ నాలుగో క్వార్టర్లో ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మజ్గావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్లో కేంద్రం రూ. 5,000 కోట్ల విలువైన వాటాలను ఓఎఫ్ఎస్ ద్వారా అమ్మింది. పబ్లిక్ కంపెనీల ప్రమోటర్లు తమ షేర్లను ప్రజలకు విక్రయించడానికి ఉపయోగించే పద్ధతిని ఓఎఫ్ఎస్ అంటారు.
ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్లాట్ఫారాల ద్వారా జరుగుతుంది. సాధారణంగా పెద్ద మొత్తంలో షేర్లను విక్రయించడానికి ఇది అనుకూలమైన మార్గమని సీనియర్ ఎనలిస్టు ఒకరు చెప్పారు. ఈ సంస్థల్లో ఓఎఫ్ఎస్ ద్వారా వాటాలు విక్రయించడం ద్వారా ప్రభుత్వం 2026 ఆర్థిక సంవత్సరం లో నిర్దేశించుకున్న రూ.47 వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించవచ్చని అన్నారు.