
- హైదరాబాద్లో ఫార్ములా–ఈ రేస్ రద్దు
- కొత్త ప్రభుత్వం కాంట్రాక్ట్ను ఉల్లంఘించిందన్న ఎఫ్ఐఏ
- నోటీసులు ఇచ్చి, చట్టపరంగా ముందుకెళ్తామని ప్రకటన
హైదరాబాద్, వెలుగు : వచ్చే నెలలో హైదరాబాద్ వేదికగా జరగాల్సిన ఫార్ములా–ఈ ప్రిక్స్ రేస్ రద్దయింది. రాష్ట్రంలో గత ప్రభుత్వం తమతో చేసుకున్న కాంట్రాక్ట్ను కొత్తగా ఏర్పాటైన సర్కారు ఉల్లంఘించిందని ఫార్ములా– ఈ ప్రిక్స్ రేసును నిర్వహించే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ (ఎఫ్ఐఏ) సంస్థ ఆరోపించింది. దీనిపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెలవప్మెంట్ డిపార్ట్మెంట్(ఎంఏయూడీ)కు నోటీసులు ఇస్తున్నట్టు శనివారం ప్రకటించింది.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి10న సిటీలో రేస్ జరగాల్సి ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో చర్చలు జరిపిన తర్వాత గతేడాది అక్టోబర్ 30న చేసుకున్న ఒప్పందానికి ప్రభుత్వం కట్టుబడకపోవడంతో రేస్ను రద్దు చేయాల్సి వచ్చిందని ఎఫ్ఐఏ తెలిపింది. నోటీసులు ఇచ్చి.. చట్టపరంగా ముందుకెళ్తామని తెలిపింది.
నాలుగేండ్ల ఒప్పందం.. ఏడాదితో ఖతం
సిటీలో రేస్లు నిర్వహించేలా గతేడాది ఫార్ములా–-ఈ ఆర్గనైజర్లతో రాష్ట్ర ప్రభుత్వం, గ్రీన్కో నాలుగేండ్ల కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో హుస్సేన్ సాగర్ సమీపంలో కొత్త సెక్రటేరియట్ చుట్టూ నిర్మించిన హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్పై ఫార్ములా– ఈ రేస్ నిర్వహించారు. ఇండియాలో తొలిసారిగా జరిగిన ఈ రేస్ కు మోటార్ స్పోర్ట్ అభిమానుల మంచి స్పందన వచ్చింది. కానీ రేస్ కారణంగా ట్యాంక్బండ్ సమీపంలో కొన్ని రోజులు వెహికల్స్ను అనుమతించకపోవడంతో ట్రాఫిక్ జామ్లతో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
నగరం నడిబొడ్డున రేస్లు నిర్వహించడంపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు మండిపడ్డారు. ఇటీవల ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం సాధారణ జనాలకు ఇబ్బంది కలిగించిన ఈ రేస్పై ఆసక్తి చూపలేదు. ఈ రేస్కు సంబంధించిన అన్ని వివరాలు ఇవ్వాలని గత నెలలో తమను సంప్రదించిన నిర్వాహకులను ప్రభుత్వం కోరింది. దాంతో రేస్ జరిగే అవకాశం లేదని ఫార్ములా–ఈ అప్పుడే చెప్పింది. తాజా ప్రకటనతో నాలుగేండ్ల ఒప్పందం ఒక్క ఏడాదిలో ముగిసినట్లయింది.