
దోహా: యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సాకర్ మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఫుట్బాల్ ఫ్యాన్స్ పడిచచ్చే ఫిఫా వరల్డ్ కప్ గల్ఫ్ దేశం ఖతార్ వేదికగా ఆదివారం నుంచి వచ్చే నెల 18వ తేదీ వరకు సందడి చేయనుంది. మెగా ఈవెంట్లో 32 జట్లు బరిలో నిలిచాయి. తొలి రోజు ఆతిథ్య ఖతార్, ఈక్వెడర్ మధ్య మ్యాచ్తో ఫిఫా వార్కు తెరలేవనుంది. ఇప్పటిదాకా వరల్డ్ కప్ ఆడని ఖతార్ జట్టు ఆతిథ్య దేశం హోదాలో ఈసారి చాన్స్ దక్కించుకుంది. 29 రోజుల ఈ టోర్నీలో మొత్తం 64 మ్యాచ్లు జరుగుతాయి. ఐదు నగరాల్లో ఎనిమిది స్టేడియాల్లో ఈ మ్యాచ్లు నిర్వహిస్తారు. గల్ఫ్ దేశంలో డే టైమ్లో విపరీతమైన వేడి దృష్ట్యా అన్ని స్టేడియాల్లో సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేశారు. ఇక, ఖతార్ తొలిసారి ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. అయితే, సాకర్ స్టార్ల ఆటతో పాటు ఖతార్ పాలనపై కూడా ఈ నెల రోజుల్లో ప్రపంచం ఫోకస్ చేయనుంది. మానవ హక్కులు, వలస కార్మికులు, ఎల్జీబీటీ కమ్యూనిటీలపై గల్ఫ్ దేశం వైఖరి, స్టేడియాల్లో బీర్ బ్యాన్ ఇప్పటికే చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీని ఖతార్ ఏ విధంగా నిర్వహిస్తుందనేది ఆసక్తి కలిగిస్తోంది.
ఫార్మాట్ ఇలా
టోర్నీలో పోటీ పడుతున్న 32 జట్లు 8 గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. ముందుగా గ్రూప్ దశలో ప్రతి జట్టు... గ్రూప్లోని మిగతా మూడింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్లో తొలి రెండు ప్లేస్ల్లో నిలిచిన 16 టీమ్స్ ప్రిక్వార్టర్స్ (నాకౌట్ స్టేజ్)కు క్వాలిఫై అవుతాయి. గ్రూప్ దశలో 48 మ్యాచ్లు, నాకౌట్ (ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్, సెమీస్, థర్డ్ ప్లేస్ ప్లే ఆఫ్, ఫైనల్) 16 మ్యాచ్లు ఉంటాయి.
వీళ్లపై ఓ కన్నేద్దాం
అత్యుత్తమ పోటీ ఉండే మెగా టోర్నీలో ఫలానా టీమ్ టైటిల్ గెలుస్తుందని చెప్పలేం. గత ఎడిషన్లో మేటి జట్లను అధిగమించి క్రొయేషియా ఫైనల్రావడమే ఇందుకు ఉదాహరణ. డిఫెండింగ్ చాంప్ ఫ్రాన్స్తో పాటు బ్రెజిల్, అర్జెంటీనా, స్పెయిన్, ఇంగ్లండ్, బెల్జియం ఈ సారి టైటిల్ రేసులో ముందున్నాయి. ఏజ్ దృష్ట్యా అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ, పోర్చుగల్ లెజెండ్ క్రిస్టియానోకు ఇదే చివరి వరల్డ్ కప్అయ్యేలా ఉంది. తమ దేశానికి కప్పు అందించాలన్న కలను నెరవేర్చుకోవాలని ఆశిస్తున్న ఈ ఇద్దరితో పాటు బ్రెజిల్ కెప్టెన్ నేమార్, గత ఎడిషన్ గోల్డెన్ బూట్ విన్నర్ హ్యారీ కేన్ (ఇంగ్లండ్), ఫ్రాన్స్ స్టార్ఎంబపేపై భారీ అంచనాలున్నాయి. పలు దేశాలకు చెందిన యంగ్స్టర్స్ కూడా ఈ టోర్నీలో సత్తా చాటి హీరోలుగా మారేందుకు రెడీగా ఉన్నారు.
ఏ గ్రూప్ లో ఎవరు
గ్రూప్ -ఎ: ఖతార్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్;
గ్రూప్ బి: ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, వేల్స్; గ్రూప్ సి: అర్జెంటీనా, సౌదీ అరేబియా,
మెక్సికో, పోలాండ్;
గ్రూప్ డి: ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ట్యునీషియా; గ్రూప్ ఇ: స్పెయిన్, కోస్టారికా, జర్మనీ, జపాన్;
గ్రూప్ ఎఫ్: బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా; గ్రూప్ జి: బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్; గ్రూప్ హెచ్: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, సౌత్ కొరియా.
1 ఈ టోర్నీకి ఖతార్ తొలిసారి ఆతిథ్యం ఇస్తోంది. వరల్డ్ కప్కు వేదికైన తొలి అరబ్, మిడిల్ ఈస్ట్ దేశం కూడా ఇదే. ఒక్క వరల్డ్ కప్ ఆడకుండానే ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న దేశంగానూ ఖతార్ నిలిచింది.
రా. 7.30 నుంచి ఓపెనింగ్ సెర్మనీ
తొలి మ్యాచ్కు ముందు 60 వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న అల్ బేత్ స్టేడియంలో ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఇండియా టైమ్ప్రకారం రాత్రి 7.30కు సెర్మనీ స్టార్ట్ అవుతుంది. బాలీవుడ్ నటి నోరా ఫతేహి, కొరియాకు చెందిన పాప్ సూపర్ స్టార్ జుంగ్కూక్, అమెరికా మ్యూజికల్ గ్రూప్ బ్రేక్ ఐడ్ పీస్, కొలంబియా సింగర్ పాట్రిక్, అమెరికా ర్యాపర్ లిల్ బేబీ పెర్ఫామ్చేస్తారు. కొలంబియా సింగర్ షకీర చివరి నిమిషంలో ఓపెనింగ్ సెర్మనీ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.