- హాజరుకానున్న సీఎస్ రామకృష్ణారావు
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఐదో జాతీయస్థాయి సదస్సు దేశ రాజధాని ఢిల్లీలో జరగనుంది. ఢిల్లీలోని పూసాలో ఈ నెల 26 నుంచి 28 వరకు మూడ్రోజులపాటు కొనసాగనుంది. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. వికసిత్ భారత్–-2047 లక్ష్యాలను సాధించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసేలా దిశానిర్దేశం చేయడానికి కేంద్రం ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నది. ఇందులో సీఎస్లతోపాటు జిల్లాల యువ కలెక్టర్లు, పలు మంత్రిత్వశాఖల కార్యదర్శులు పాల్గొననున్నారు.
ఇందులో భాగంగానే తెలంగాణ నుంచి సీఎస్ రామకృష్ణారావుతో పాటు అధికార యంత్రాంగం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నది. ఈ సదస్సులో పలు శాఖలకు సంబంధించిన అంశాలపై సుధీర్ఘంగా చర్చించనున్నారు. అలాగే, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యచరణాలపై కీలక నిర్ణయం తీసుకునే వీలుందని అధికారిక వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
