హోబర్ట్: ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్లో వరుస ఓటములతో సతమతమవుతున్న ఇండియా మెన్స్ హాకీ జట్టు ఎట్టకేలకు అద్భుత విజయంతో పుంజుకుంది. బుధవారం జరిగిన హోబర్ట్ లెగ్ చివరి మ్యాచ్లో వరల్డ్ నంబర్ 3 టీమ్ ఆస్ట్రేలియాను షూటౌట్లో 3-–1 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. ఉత్కంఠగా సాగిన పోరులో తొలి మూడు క్వార్టర్లలో ఒక్క గోల్ కూడా రాలేదు.
49వ నిమిషంలో ఆస్ట్రేలియా కెప్టెన్ జెరెమీ హేవార్డ్ పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచగా.. రెండు నిమిషాల వ్యవధిలోనే (51వ ని) షిలానంద్ లక్రా ఫీల్డ్ గోల్తో స్కోరు 1–-1తో సమం చేశాడు. విన్నర్ను తేల్చేందుకు నిర్వహించిన షూటౌట్లో ఇండియా ఆటగాళ్లు షిలానంద్ లక్రా, మణీందర్, విష్ణుకాంత్ గోల్స్ చేయగా.. యంగ్ గోల్ కీపర్ మోహిత్ మూడుసార్లు ఆస్ట్రేలియా ప్రయత్నాలను అడ్డుకుని జట్టును గెలిపించాడు.
