- ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీకి నిర్ణయం
- నెల రోజుల్లోనే ప్రక్రియ పూర్తయ్యేలా కసరత్తు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. కాంట్రాక్ట్ పద్ధతిలో సుమారు వెయ్యి పోస్టు లు భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియెట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు ఉండనున్నాయి.
ఇప్పటి కే ఏర్పాటైన మెడికల్ కాలేజీలతో పాటు, ఈ ఏడాది ప్రారంభించే మెడికల్ కాలేజీల్లో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. నెల రోజుల్లో గా నియామక ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. మెడికల్ కాలేజీల్లో సదుపాయాల పై త్వరలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తనిఖీలు ప్రారంభం కానున్నా యి.
ఇప్పటికే సిబ్బంది కొరత, సదుపాయాల లేమి వంటి అంశాలపై, ఇటీవలే దాదాపు అన్ని కొత్త మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులిచ్చింది. వీటికి వైద్య ఆరోగ్య శాఖ తరఫున జవాబివ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు కొత్త మెడికల్ కాలేజీల తనిఖీ కి ఎన్ఎంసీ బృందం క్షేత్ర స్థాయి పర్యటనకు రానుంది. ఈలోగా నియామక ప్రక్రియ పూర్తి చేస్తే పాత మెడికల్ కాలేజీలతో పాటు కొత్త మెడికల్ కాలేజీలపై ఎన్ఎంసీ పర్మిషన్లు పొందొచ్చని అధికారులు చెప్తున్నారు.