
వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో కార్మికులు నేటి నుంచి సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో షూటింగ్లు నిలిచిపోనున్నాయి. తమ వేతనాలను 30% పెంచాలని 'తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్' డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ప్రతిపాదనకు కొన్ని నిర్మాణ సంస్థలు అంగీకరించకపోవడంతో ఈ వివాదం మరింత తారాస్థాయికి చేరింది.
సినీ కార్మికల వేతనాల పెంపు డిమాండ్లపై చర్చించడానికి ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, మైత్రీ రవి వంటి ప్రముఖ నిర్మాతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కార్మికుల డిమాండ్లను చర్చించి, పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆదివారం ఫిల్మ్ ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, ప్రధాన కార్యదర్శి అమ్మిరాజు కానుమిల్లి, కోశాధికారి టీవీ అలెగ్జాండర్ ఒక లేఖ విడుదల చేశారు. అందులో, 30% వేతన పెంపునకు అంగీకరిస్తున్నట్లు లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వాలని, ఆ లేఖ అందిన తర్వాతే షూటింగ్లకు హాజరవుతామని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు తెలుగులో ఎక్కడ షూటింగ్ జరిగినా వర్తిస్తాయని కూడా పేర్కొన్నారు.
►ALSO READ | తిరుమలలో కిరణ్ అబ్బవరం దంపతులు.. శ్రీవారి సన్నిధిలో కుమారుడికి నామకరణం
ఈ వివాదం పరిష్కారం కోసం ఈ రోజు సాయంత్రం సినీ పరిశ్రమకు చెందిన మూడు వర్గాలు కార్మిక కమిషన్ను కలవనున్నాయి. ఈ చర్చలు ఏ విధంగా ముగుస్తాయోనని చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ బంద్ వల్ల ఇప్పటికే షూటింగ్లో ఉన్న సినిమాల పైనా ప్రభావం పడనుంది. అన్నపూర్ణ స్టూడియోస్లో పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో, ఫెడరేషన్ ప్రతినిధులు ఆయన్ని కలిసి తమ సమస్యలను వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బంద్తో కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అంచనా. ఈ సమస్య త్వరగా పరిష్కారమైతేనే, షూటింగ్లు తిరిగి ప్రారంభమవుతాయని కార్మికులు హెచ్చరిస్తున్నారు. .