ఫోన్​ చేస్తే..హోమ్​ డెలివరీ..మహబూబ్ నగర్ గ్రామాల్లో మళ్లీ ఫిల్టర్​ ఇసుక దందా షురూ

 ఫోన్​ చేస్తే..హోమ్​ డెలివరీ..మహబూబ్ నగర్ గ్రామాల్లో మళ్లీ ఫిల్టర్​ ఇసుక దందా షురూ
  •    ఫోన్ల ద్వారా వచ్చిన ఆర్డర్లకే ఇసుక తయారీ
  •     డంపులపైనే దృష్టి పెడుతున్న ఆఫీపర్లు
  •     వాగులు, వ్యవసాయ పొలాల్లోని తయారీ కేంద్రాలపై నిఘా కరువు

మహబూబ్​నగర్, వెలుగు : గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సాగిన ఫిల్టర్​ ఇసుక తయారీపై కొత్త ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ దందాను అరికట్టాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఫిల్టర్​ ఇసుక తయారీదారులు కొత్త పంథాను ఎంచుకున్నారు. ఫోన్లలో వచ్చే ఆర్డర్ల ప్రకారం కృత్రిమ ఇసుకను అప్పటికప్పుడు తయారు చేసి, ఆర్డర్​ చేసిన వారి ఇండ్లకు నేరుగా పంపిస్తున్నారు. 

ఈ సారి వ్యాపారులు పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్ల కండ్లు గప్పి రహస్యంగా కృత్రిమ ఇసుకను తయారు చేస్తున్నారు. వాగులు, వంకలు, వ్యవసాయ పొలాలను అడ్డాలుగా చేసుకుంటున్నారు. ప్రధానంగా మహబూబ్​నగర్​ రూరల్​ మండలం రామచంద్రాపూర్, కోటకదిర, మాచన్​పల్లి, వెంకటాపూర్, హన్వాడ మండలం మునిమోక్షం, ఇబ్రహీంబాద్, చిర్మల్​కుచర్​తండా, జడ్చర్ల మండలం నసరుల్లాబాద్, పోలేపల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఫిల్టర్​ ఇసుక తయారు చేస్తున్నారు. 

పోలీసుల తనిఖీలు ఎక్కువ కావడంతో తెల్లవారుజామున 4 గంటల నుంచి ఐదున్నర గంటల వరకు మాత్రమే కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. ఎక్కువ  మొత్తంలో తయారు చేసి స్టోర్​ చేసుకుంటే పోలీసులతో సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో ఆర్డర్​ వస్తేనే ఇసుక తయారు​చేసి సప్లై చేయడం గమనార్హం. ట్రాక్టర్​ ఇసుకకు రూ.3 వేల నుంచి రూ.3,500 అమ్ముతున్నారు. ఇక మండలం దాటి వెళ్తే పట్టుబడే అవకాశం ఉండడంతో మండలంలోని గ్రామాలకే సప్లై చేస్తున్నారు. అది కూడా ఉదయం 6 గంటల లోపు ఆర్డర్​ ఇచ్చిన ఇంటికి ట్రాక్టర్లను పంపిస్తున్నారు.

యాసంగి సాగుకు కష్టం..

ఈ ఏడాది జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. దీంతో యాసంగిలో బోర్ల ఆధారంగా పంటలు పండించుకుంటున్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్​ కూడా మొదలైంది. ఇప్పటికే రైతులు వరి తుకాలు పోసుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామాలకు దగ్గరలో ఉన్న వాగులు, వంకల్లో కృత్రిమ ఇసుక తయారు చేస్తుండడంతో ఆ ఎఫెక్ట్​ బోర్లపై పడుతోంది. ఈ దందా ఇలాగే సాగితే వచ్చే ఎండకాలం లోపే బోర్లు అడుగంటిపోయి సాగునీటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డంపులపైనే దృష్టి పెడుతున్రు..​

ఫిల్టర్​ ఇసుక దందాను ఆరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో భాగంగా ఇసుక డంపులను సీజ్​ చేస్తున్నారు. కానీ, తెల్లవారుజామున కృత్రిమ ఇసుక తయారీ జరుగుతున్నా దానిపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. ఉదయం పూట గ్రామాల గుండా యథేచ్ఛగా ఫిల్టర్​ ఇసుక ట్రాక్టర్లు వెళ్తున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. రెవెన్యూ ఆఫీసర్లు కూడా ఈ దందాపై సీరియస్​ యాక్షన్​ తీసుకోవడం లేదు. వాగులు, వంకలు, వ్యవసాయ పొలాల వద్ద తనిఖీలు చేయాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. 

కంప్లైంట్​ చేయలేదు..

ఫిల్టర్​ ఇసుక తయారీకి సంబంధించి మాకు ఎవరూ కంప్లైంట్​ చేయలేదు. ఇటీవల రామచంద్రాపూర్​ వద్ద కొందరు మట్టిని తరలిస్తున్నారని కంప్లైంట్​ వస్తే ఆర్ఐ వెళ్లి పరిశీలించారు. ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో తిరిగి వచ్చారు. ఫిల్టర్​ ఇసుక తయారీకి సంబంధించిన సమాచారం ఇస్తే సీరియస్​ యాక్షన్​ తీసుకుంటాం.

సుందర్​ రాజన్​, తహసీల్దార్, మహబూబ్​నగర్​ రూరల్

స్పెషల్​ టీమ్స్​ ఏర్పాటు చేశాం..

ఫిల్టర్​ ఇసుక తయారీని అరికట్టడానికి హన్వాడలో స్పెషల్​ టీమ్స్​ ఏర్పాటు చేశాం. పోలీసులు కూడా తనిఖీలు చేస్తున్నారు. ఇండ్ల నిర్మాణాలకు ఇసుక అవసరమైన వారు పర్మిషన్​ తీసుకొని డంప్​ చేసుకుంటున్నారు. పర్మిషన్ లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటాం.
-
 కిష్ట్యానాయక్, తహసీల్దార్, హన్వాడ