- సింగరేణి ఎన్నికలు అక్టోబర్ 28న!
- ఈ నెల 22న ఖరారు.. అదే రోజు షెడ్యూల్ విడుదల
- డిప్యూటీ సీఎల్సీ సమక్షంలో చర్చలు సఫలం
- కార్మికులకు ఎరియర్స్, బోనస్, అడ్వాన్స్లన్నీ అక్టోబర్ నాటికి అందే చాన్స్
- అసెంబ్లీ ఎన్నికలకు కలిసివస్తుందనే ఆలోచనతోనే సర్కారు గ్రీన్సిగ్నల్
కోల్బెల్ట్/గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలకు ఎట్టకేలకు గ్రీన్సిగ్నల్ వచ్చింది. సోమవారం హైదరాబాద్లో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాసులు సమక్షంలో మేనేజ్మెంట్, 14 కార్మిక సంఘాలతో జరిగిన చర్చలు ఫలించాయి. ఇందులో ఏడో దఫా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను అక్టోబర్ 28న నిర్వహించాలని దాదాపు నిర్ణయం తీసుకున్నారు. 22న మరోసారి సమావేశమై, ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు. ఆ రోజే నామినేషన్లు, గుర్తుల కేటాయింపు, ఓట్లు లెక్కింపు అంశాలపై క్లారిటీ రానుంది.
సోమవారం జరిగిన మీటింగ్లో డిప్యూటీ సీఎల్సీ డి.శ్రీనివాసులు, సింగరేణి డైరెక్టర్(ఫైనాన్స్, పా) బలరాంనాయక్, పర్సనల్ జీఎం హనుమంతరావు, కార్మిక సంఘాల నుంచి మిర్యాల రాజిరెడ్డి, కెంగెర్ల మల్లయ్య, వి.సీతారామయ్య, ఎస్.నర్సింహారెడ్డి, యాదగిరి సత్తయ్య, టి.రాజారెడ్డి, మంద నర్సింహారావు, టి.శ్రీనివాస్, త్యాగరాజన్, ఐ.కృష్ణ, శ్రీనివాసరెడ్డి, జి.రాములు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశంలో షెడ్యూల్వెంటనే ప్రకటించాలని ఏఐటీయూసీ, బీఎంఎస్ పట్టుబట్టాయి. దీనిని మెజార్టీ సంఘాలు వ్యతిరేకించాయి.
మూడు సార్లు వాయిదా
2017, అక్టోబర్5న చివరిసారి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. అప్పుడు టీబీజీకేఎస్ గెలిచింది. నాలుగేండ్ల కాలపరిమితితో నిర్వహించిన ఆ ఎన్నికల గడువు 2021, అక్టోబర్నాటికి పూర్తయింది. అయితే, టీబీజీకేఎస్ కుఆరు నెలల తర్వాత (2018, ఏప్రిల్)లో గుర్తింపు హోదా సర్టిఫికెట్ఇచ్చారు. ఆ సర్టిఫికెట్లో కాలపరిమితి రెండేండ్లేనని పేర్కొన్నారు. దీనిపై గుర్తింపు సంఘం కోర్టును ఆశ్రయించింది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సిన సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర సర్కార్ వివిధ సాకులు చూపుతూ వాయిదా వేస్తూ వచ్చాయి.
గతేడాది నవంబర్ లో ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించగా, మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. కానీ, మేనేజ్మెంట్ మరో మూడు నెలల గడువు కోరింది. ఈ క్రమంలో మూడు సార్లు వాయిదా పడిన ఎన్నికలు ఎట్టకేలకు అక్టోబర్28న జరగబోతున్నాయి.
ఎన్నికల్లో లబ్ధిపై సర్కారు ఆశలు ..
ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో సింగరేణి విస్తరించి ఉంది. 11 ఏరియాల్లో దాదాపు 42వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే, కోల్బెల్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ సంక్షేమం మరిచారని, సింగరేణి ఫండ్స్ను దారి మళ్లిస్తున్నా పట్టించుకోవడంలేదని కార్మికులు, కార్మికసంఘాల నేతలు ఆగ్రహంతో ఉన్నారు. టీబీజీకేఎస్పైనా వ్యతిరేకత ఉన్నట్లు సర్కార్ గుర్తించింది. ఈ తరుణంలో ఎన్నికలకు వెళ్తే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే చాన్స్ ఉందని భావించింది. కానీ, ఈనెల 22న 11వ వేతన ఒప్పంద బకాయిలు రూ.1,726 కోట్లు కార్మికులకు చెల్లించనున్నారు.
ఒక్కో కార్మికుడికి సగటున రూ.4లక్షల వరకు దక్కే చాన్స్ ఉంది. అటు 2022–-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన లాభాల్లో రూ.700 కోట్లు కార్మికులకు వాటాగా చెల్లించడంతో పాటు, త్వరలో దసరా అడ్వాన్సు, దీపావళి బోనస్ డిక్లేర్ చేయనున్నారు. ఈ ఆర్థిక ప్రయోజనాలన్నీ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అందే వీలుంది. ఇవన్నీ టీబీజీకేఎస్, బీఆర్ఎస్కు అనుకూలంగా మారుతాయని, అనంతరం జరిగే అసెంబ్లీ ఎన్నికలకూ కలిసివస్తాయని సర్కారు భావిస్తోంది. అందువల్లే అక్టోబర్లో ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం ద్వారా ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.