పాత అప్పులు తీర్తలేవ్..కొత్త అప్పులు పుడ్తలేవ్

పాత అప్పులు తీర్తలేవ్..కొత్త అప్పులు పుడ్తలేవ్
  • తగ్గుతున్న సర్కార్​ పతార
  • నెల నెలా జీతాలకే ఆర్​బీఐ నుంచి చేబదుళ్లు
  • లోన్లు ఇవ్వలేమని తేల్చిచెప్పిన బ్యాంకులు, సంస్థలు
  • పనులు, ప్రాజెక్టులకు బ్రేక్​
  • రూ. 4 లక్షల కోట్లు దాటిన మొత్తం అప్పుల చిట్టా
  • కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నదే రూ. 2.58 లక్షల కోట్లు

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర  ఖజానా గాడి తప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు కూడా కటకట అవుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం మొదలైనప్పటి నుంచీ చేబదులు నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం కాలం వెళ్లదీస్తున్నది. మార్కెట్​  లోన్లతోపాటు అడ్డగోలుగా చేసిన అప్పులకు మిత్తీలు కట్టేందుకు తిప్పలు పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు మోతాదుకు మించిపోవటంతోనే  ఈ పరిస్థితి తలెత్తింది.ఆర్​బీఐ నుంచి చేబదులు తెచ్చిన నిధులను నెలనెలా తిరిగి చెల్లించలేని సంక్షోభంలో  రాష్ట్ర సర్కార్​ చిక్కుకున్నది. దీంతో కొంతకాలంగా రాష్ట్రానికి అప్పులిచ్చేందుకు రుణ దాతలు ముందుకు రావటం లేదు. అప్పులిస్తామని మాటిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వెనుకాడుతున్నాయి. కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ పతార ఆరేండ్లకే పడిపోతున్నదన్న సందేహాలు మొదలయ్యాయి.

హద్దు మీరిన చేబదుళ్లు

డబ్బుల్లేకపోతే ఆర్​బీఐ నుంచి చేబదుళ్లు తెచ్చుకునే వెసులుబాటు అన్ని రాష్ట్రాలకు ఉంటుంది. విపత్కర పరిస్థితుల్లో జీతాలు, ఆఫీసుల నిర్వహణతోపాటు పెన్షన్లు, స్కీమ్‌‌లు ఆగకుండా ఉండేందుకు చేబదులు తప్పదని ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ.. చేబదులు చేసే లిమిట్‌‌ దాటిపోతే రాష్ట్ర ప్రభుత్వం పరపతి అంతకంతకు తగ్గిపోతుందని వారు అంటున్నారు. సాధారణంగా రాష్ట్రాలు ఆర్‌‌బీఐ నుంచి వేస్ అండ్​ మీన్స్​ పేరిట డబ్బును చేబదులు తెచ్చుకుంటాయి. ఆదాయం సమకూరగానే  వారం నుంచి  పది రోజుల్లో తిరిగి చెల్లిస్తాయి. అయితే.. జూన్, జులై, ఆగస్టు మూడు నెలల్లో సగటున రూ. 1,200 కోట్లు ఆర్‌‌బీఐ నుంచి తెలంగాణ చేబదులు తెచ్చుకుంది. జులై, ఆగస్టులో వీటిని తిరిగి తీర్చలేకపోయింది. వేస్ అండ్​ మీన్స్‌‌కి మించి డబ్బులు అవసరం కావటంతో ఆర్‌‌బీఐ నుంచి ఓవర్​ డ్రాఫ్ట్ పేరుతో మరింత డబ్బు తీసుకుంది. జులై లో రూ. 286 కోట్లు, ఆగస్టులో రూ. 756 కోట్లు ఓడీ తీసుకుంది. అంటే హద్దులు మీరి రాష్ట్ర ప్రభుత్వం చేబదులు చేస్తున్న తీరు ఖజానా డొల్లతనాన్ని బయటపెట్టింది. ఆదాయ వ్యయ నిర్వహణలో క్రమ శిక్షణ పాటించకపోవటం,  ఇష్టమొచ్చినట్లు అప్పులు తీసుకురావటంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు స్పష్టమవుతున్నది.

మోతాదు మించిన అప్పుల భారం

రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ. 4 లక్షల కోట్లు దాటాయి. అధికారికంగా ఎఫ్​ఆర్​బీఎం పరిధిలో ఆరేండ్లలో రూ. 1.88 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఇవి కాకుండా బడ్జెట్​తో సంబంధం లేకుండా  కార్పొరేషన్ల ద్వారా ఇరిగేషన్‌‌, ఎలక్ట్రిసిటీ  తదితర ప్రాజెక్టుల కోసం అంతకుమించి అప్పులు తెచ్చింది. వీటన్నింటికీ ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి  రుణ సమీకరణ చేసింది. ఇలా తెచ్చిన అప్పులు రూ. 2.58 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 1.54 లక్షల  కోట్ల అప్పులున్నాయని, గడిచిన ఐదేండ్లలో రూ. 34,296 కోట్లు రీ  పే చేశామని ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌‌రావు ప్రకటించారు. ఈ లెక్కన చూసుకున్నా  రూ.4.12 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. మరోవైపు కరోనా కారణంగా రాష్ట్ర ఖజనాకు రాబడి భారీగా తగ్గిపోయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను కోత పెట్టడంతో పాటు  పనులు, పాత బిల్లులన్నీ ప్రభుత్వం ఆపేసింది.  అమల్లో ఉన్న స్కీమ్​లకు నిధులు విడుదల చేయటం కూడా సవాల్‌‌గా మారింది. అప్పటివరకు భారీగా అప్పులు తెచ్చి ప్రియారిటీపై చేపట్టిన ఇరిగేషన్​ ప్రాజెక్టులను పక్కనపెట్టింది.  కానీ దుబ్బాక ఉప ఎన్నిక రావటంతో మళ్లీ అప్పులు, చేబదులు నిధులతోనే  ప్రభుత్వం హడావుడి చేసింది. ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, రైతు వేదికలకు నిధులతోపాటు , ప్రభుత్వ ఉద్యోగులకు కోత పెట్టిన జీతాలను విడతల వారీగా చెల్లింపులను ప్రారంభించింది.

అన్ని పనులకు బ్రేకులు

కరోనా టైమ్​లో.. ఆమ్దానీకి లోటు లేదని, సర్కారుకు పతార ఉంది కాబట్టి  అప్పులు వస్తున్నాయని సీఎం కేసీఆర్​ చెప్పారు. ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులకు లోన్‌‌ లింకేజీ ఉంది కాబట్టి ప్రాజెక్టులు నిర్మించి తీరుతామన్నారు. కానీ కొన్ని నెలల్లోనే  సీన్‌‌ రివర్స్‌‌  అయింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ. 6 వేల కోట్లు, కాళేశ్వరం అడిషనల్‌‌ టీఎంసీకి రూ. 14 వేల కోట్ల అప్పులు ఇవ్వబోమని పవర్‌‌ ఫైనాన్స్‌‌ కార్పొరేషన్‌‌, రూరల్‌‌ ఎలక్ట్రిఫికల్‌‌ కార్పొరేషన్లు తేల్చిచెప్పాయి. బ్యాంకుల కన్సార్షియం కూడా ఇప్పట్లో ఎలాంటి లోన్లు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. దీంతో ఇరిగేషన్‌‌ ప్రాజెక్టుల పనులు చేసిన వర్క్‌‌ ఏజెన్సీలకు బకాయి పడ్డ రూ. 10 వేల కోట్ల పేమెంట్లను ప్రభుత్వం ఆపేసింది. ఈ ఫైనాన్స్‌‌ ఇయర్‌‌లో పేమెంట్‌‌ చేయలేమని తేల్చిచెప్పింది. ఇతరత్రా లోన్లు రాకపోవడంతో నాబార్డ్‌‌  ద్వారా రుణ సమీకరణ చేసి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులతోపాటు జీవన ప్రమాణాలు పెంపొందించే కార్యక్రమాలపై సర్కారు ఫోకస్‌‌ చేసింది. అదే సమయంలో సర్కారు బాండ్లను వేలం వేయడం ద్వారా నెలకు రూ. 4 వేల కోట్ల వరకు అప్పులు తెచ్చి ఆ మొత్తంతో బండి లాగిస్తున్నది. సర్కారుకు సమకూరే ఆదాయాన్ని సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నది.

ఈ ఏడాది ఆర్‌‌బీఐ నుంచి రూ. 30 వేల కోట్ల అప్పు

కరోనా కష్టాలతో ఖజానా కుదేలైంది. ఆదాయం సగానికి పడిపోయింది. సాధారణంగా రావాల్సిన ఆదాయంలో 55 శాతం వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ ఖర్చులకు మిగతా 45 శాతం అప్పులు తెచ్చింది.  ఏప్రిల్‌‌ నుంచి అక్టోబర్‌‌  వరకు దాదాపు రూ. 3‌‌0 వేల కోట్లు అప్పులు తెచ్చింది.  ఏప్రిల్‌‌, మే నెలల్లో కలిపి రూ. 13,352 కోట్లు, జూన్‌‌లో రూ. 4,318 కోట్లు, జులైలో రూ. 3,113 కోట్లు, ఆగస్టులో రూ. 3,936, సెప్టెంబర్‌‌లో రూ. 2,500 కోట్లు, అక్టోబర్‌‌లో రూ. 2,750  కోట్ల అప్పులు చేసింది. నవంబర్‌‌లో రూ. 750 కోట్ల అప్పు కోరింది.  ఈ నెల 10న బాండ్ల వేలం నిర్వహించనుంది.

కిస్తీలకే నెలకు రూ. 3 వేల కోట్లు

ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులతో పాటు కార్పొరేషన్ల అప్పుల కిస్తీలే తడిసి మోపెడవుతున్నాయి. అసలు, మిత్తీల చెల్లింపులకే ప్రతి నెలా  రూ. 3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. లాక్‌‌డౌన్‌‌ టైమ్​లో  సీఎం కేసీఆర్‌‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న లోన్ల రీ పేమెంట్‌‌ ఈ యేడాదే  ప్రారంభమైంది. తిరిగి చెల్లించాల్సిన మొత్తం యేటా పెరుగుతూ పోతుందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి.  ఇంత భారీ మొత్తంలో కిస్తీలు చెల్లించడానికి తిరిగి అప్పులు చేయడం మినహా వేరే మార్గం లేదని అంటున్నాయి.

 

అన్ని పనులకు బ్రేకులు

కరోనా టైమ్​లో.. ఆమ్దానీకి లోటు లేదని, సర్కారుకు పతార ఉంది కాబట్టి  అప్పులు వస్తున్నాయని సీఎం కేసీఆర్​ చెప్పారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు లోన్‌ లింకేజీ ఉంది కాబట్టి ప్రాజెక్టులు నిర్మించి తీరుతామన్నారు. కానీ కొన్ని నెలల్లోనే  సీన్‌ రివర్స్‌  అయింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ. 6 వేల కోట్లు, కాళేశ్వరం అడిషనల్‌ టీఎంసీకి రూ. 14 వేల కోట్ల అప్పులు ఇవ్వబోమని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రూరల్‌ ఎలక్ట్రిఫికల్‌ కార్పొరేషన్​ తేల్చిచెప్పాయి. బ్యాంకుల కన్సార్షియం కూడా ఇప్పట్లో ఎలాంటి లోన్లు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. దీంతో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పనులు చేసిన వర్క్‌ ఏజెన్సీలకు బకాయి పడ్డ రూ. 10 వేల కోట్ల పేమెంట్లను ప్రభుత్వం ఆపేసింది. ఈ ఫైనాన్స్‌ ఇయర్‌లో పేమెంట్‌ చేయలేమని తేల్చిచెప్పింది. ఇతరత్రా లోన్లు రాకపోవడంతో నాబార్డ్‌  ద్వారా అప్పులు తీసుకొని ఊళ్లలో మౌలిక వసతులతోపాటు జీవన ప్రమాణాలు పెంపొందించే కార్యక్రమాలపై సర్కారు ఫోకస్‌ చేసింది. అదే సమయంలో సర్కారు బాండ్లను వేలం వేయడం ద్వారా నెలకు రూ. 4 వేల కోట్ల వరకు అప్పులు తెచ్చి ఆ మొత్తంతో బండి లాగిస్తున్నది.

ఆరేండ్ల నుంచి  కార్పొరేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న
అప్పులు (రూ. కోట్లల్లో)

ఇరిగేషన్‌‌                 97,000

మిషన్‌‌ భగీరథ         30,000

జీహెచ్‌‌ఎంసీ               7,000

హైదరాబాద్‌‌ వాటర్‌‌ బోర్డు 11,400

డిస్కంలు                35,000

జెన్‌‌కో                     62,857

యానిమల్‌‌ హజ్బెండరీ 4,000

ఆర్టీసీ                       1,100

ఇతర శాఖలు          10,000