న్యూఢిల్లీ: ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ను నష్టాల్లో అమ్ముతున్నామని, దేశంలో ఆయిల్ రిటైలింగ్ బిజినెస్ లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భావిస్తున్నాయి. ఇంటర్నేషనల్గా క్రూడాయిల్ రేట్లు రికార్డ్ లెవెల్స్కు పెరిగినప్పుడు కూడా దేశంలో పెట్రో రేట్లను కంపెనీలు మార్చని విషయం తెలిసిందే. ఆ తర్వాత ( ఈ ఏడాది మార్చి 22 నుంచి) వరసగా 14 సార్లు లీటర్ పెట్రోల్, డీజిల్పై 80 పైసలు చొప్పున రేట్లు పెంచాయి.
దీంతో పెట్రోల్, డీజిల్ రేట్లు లీటర్పై రూ. 10 వరకు పెరిగాయి. అయినప్పటికీ, ఇంకా నష్టాల్లోనే అమ్ముతున్నామని కంపెనీలు చెబుతున్నాయి. ‘లీటర్ డీజిల్పై రూ. 20–25, పెట్రోల్పై రూ. 14–18 వరకు నష్టపోతున్నాం’ అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ (ఎఫ్ఐపీఐ) ప్రకటించింది. పెట్రో రేట్లను ఈ ఏడాది ఏప్రిల్ 6 నుంచి మార్చలేదు. ఇంటర్నేషనల్గా క్రూడాయిల్ రేటు ప్రస్తుతం బ్యారెల్కు 120 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. బల్క్ డీజిల్ రేటును మాత్రం ఇంటర్నేషనల్ రేట్లకు తగ్గట్టుగానే కంపెనీలు పెంచుకుంటూ వస్తున్నాయి.
ఎఫ్ఐపీఐలో జియో–బీపీ, రోస్నెఫ్ట్కు చెందిన నయారా ఎనర్జీ, షెల్ వంటి ప్రైవేట్ కంపెనీలు, ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి ప్రభుత్వ కంపెనీలు మెంబర్లుగా ఉన్నాయి. ‘దేశ ఆయిల్ రిటైలింగ్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరిన్ని ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలన్నా, బిజినెస్ను విస్తరించాలన్నా కంపెనీలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రిటైల్ రేట్లకు సంబంధించి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి’ అని ప్రభుత్వానికి రాసిన లెటర్లో ఎఫ్ఐపీఐ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ పేర్కొన్నారు.
కాగా, యూనివర్శల్ సర్వీస్ ఆబ్లిగేషన్ (యూఎస్ఓ) కింద ప్రైవేట్ కంపెనీలన్నీ ఈ నెల 17 నుంచి రిమోట్ ఏరియాల్లోని పెట్రోల్ బంకులతో సహా అన్ని పెట్రోల్ బంకుల్లో నిర్ధిష్టమైన గంటల పాటు సేల్స్ జరపడం తప్పనిసరి. ఈ రూల్స్ ఫాలో కాకపోతే లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉంది.