- కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తున్నది: పీసీసీ చీఫ్ మహేశ్
హైదరాబాద్, వెలుగు: నేషనల్ హెరాల్డ్ అంశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ పేర్లను చేర్చుతూ ఫ్రెష్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఈ కేసును ఎన్నో సార్లు, ఎన్నో విచారణ సంస్థలు విచారించినా.. ఒక్కటి కూడా రుజువు కాలేదని అన్నారు.
ఈ మేరకు ఆదివారం మహేశ్గౌడ్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. ‘‘రాహుల్గాంధీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భయపడుతున్నది. అందుకే మళ్లీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నది. ఇది రాజకీయ ప్రతీకారం మాత్రమే” అని వ్యాఖ్యానించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ తమ రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకుంటున్నదని మరోసారి నిరూపితమైందని అన్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజాబలం కోల్పోతున్నదని వ్యాఖ్యానించారు. ఈ కేసును కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా, చట్టపరంగా ఎదుర్కొంటుందని, ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు భయపడబోదని తేల్చి చెప్పారు.
