
కోలీవుడ్ స్టార్ విక్రమ్ కొడుకు ధృవ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బైసన్’. దర్శకుడు పా రంజిత్ సమర్పణలో మారి సెల్వరాజ్ ఈ సినిమాను రూపొందించాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు. నివాస్ కే ప్రసన్న కంపోజ్ చేసిన ఈ పాటకు దర్శకుడు మారి సెల్వరాజ్ తమిళంలో లిరిక్స్ రాయగా, ఎనమంద్రా రామకృష్ణ తెలుగు లిరిక్స్ను అందించాడు. మనువర్ధన్ పాడాడు.
‘తీరేనా తీరేనా.. గుండెల్లోన మండుతున్న మూగవేదన..’ అంటూ సాగిన పాట ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 24న జగదంబే ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మాత బాలాజీ తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న ఈ సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉందని బాలాజీ అన్నారు.
పశుపతి, కలైయరసన్, రెజిషా విజయన్, హరికృష్ణన్, అళగమ్ పెరుమాళ్, అరువి మదన్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలు పోషించారు. సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా రంజిత్, అదితి ఆనంద్ కలిసి నిర్మిస్తున్నారు.