
హైదరాబాద్: శివ సత్తుల పూనకాలతో.. పోతురాజుల ఆటపాటలతో.. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఆషాఢ మాస బోనాలు.. కరోనా కల్లోలం క్రమంలో చరిత్రలో తొలిసారిగా బోనాల పండుగ నిరాడంబరంగా సాగింది. తెలంగాణ సంస్కృతీసాంప్రదాయాలకు ప్రతీకగా ఉండే ఆషాఢ మాసం బోనాల పండుగ ముగింపు దశకు చేరింది. పాతబస్తీ లాల్ దర్వాజలో మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు.
భారీ జనసందోహం, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటపాటలు లేకుండానే ఈ దఫా పండుగ గడిచిపోయింది. విశిష్ఠమైన లాల్ దర్వాజ బోనాల వేడుకలు ఆదివారం తెల్లవారు జామున మూడు గంటలకే ప్రారంభమయ్యాయి. మొదట అమ్మవారికి అర్చకులు జల కడవ సమర్పించారు.